ప్రభుత్వం వరమిచ్చింది... 10% లోపు సంస్థలకే!, రూ.3 లక్షల కోట్ల రుణాలపై సందిగ్ధం
దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించాలన్నది సామెత. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ను ఆదుకునేందుకు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అనేక చర్యలు ప్రకటించారు. ఇందులో అందరి దృష్టినీ ఆకర్షించింది రూ 3 లక్షల కోట్ల రుణాల మంజూరు విషయం. పైగా ఇంత భారీ రుణాలకు పూర్తిగా ప్రభుత్వమే పూచీకత్తు ఇస్తుండటం విశేషం. దేశ చరిత్రలోనే ప్రభుత్వం నుంచి ఒక రంగానికి ఇంత భారీ స్థాయిలో రుణాల మంజూరు హామీ తొలిసారి కావటం విశేషం. పైగా రుణాలు తీసుకునే ఏ సంస్థ కూడా తమ వంతుగా ఎలాంటి సెక్యూరిటీ, కొల్లేటరల్ గారంటీ ఇవ్వాల్సిన అవసరమే లేకపోవటం మరో విశేషం. అయితే, ప్రభుత్వమైతే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది కానీ... బ్యాంకులు దీనిని ఎంత వరకు అమలు చేస్తాయా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారవుతోంది. ఎందుకంటే, పేరుకు పూచీకత్తు లేని రుణాలే అయినా... భవిష్యత్ లో అవి నిరర్థక ఆస్తులుగా తయారైతే అప్పుడు పరిస్థి ఏమిటా అని సహజంగానే బ్యాంకులు ఆలోచిస్తాయి. ఆ ఆలోచనే నిజానికి రుణాలు అవసరం ఐన చిన్న సంస్థలకు పెద్ద అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది.
ఆ భయంతో కంపెనీలకు బ్యాంకులు దూరం, అందుకే మోడీ ప్రభుత్వం 'తప్పనిసరి' చర్య
పెద్దలకే ప్రయోజనం?
రుణాల మంజూరు విషయంలో ప్రస్తుతం కేవలం ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకుంది. దీనిపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టమైన మార్గనిర్దేశకాలు ప్రకటించాల్సి ఉంది. వాటి ఆధారంగానే ఈ రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. నిర్మల సీతారామన్ ప్రకటనను పరిశీలిస్తే ... ఈ పథకం ద్వారా లబ్ది పొందేది రూ 25 కోట్ల వరకు రుణాల చెల్లింపుల బకాయిలు ఉండి, రూ 100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్నకంపెనీలు అని స్పష్టమవుతోంది. సహజంగానే రూ 100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు వ్యాపారంలో స్థిరత్వం పొంది ఉంటాయి. పైగా బ్యాంకులతో సత్సంబంధాలు కలిగి ఉంటాయి. అవి ఇప్పటికే భారీ స్థాయిలో రుణాలు తీసుకుని ఉంటాయి. కాబట్టి, ఈ కొత్త పథకంలో మరో సారి ఆయా కంపెనీలకే పెద్ద ఎత్తున కొత్త రుణాలు మంజూరు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
చితికిపోతున్న చిన్న సంస్థలు...
దేశంలో మొత్తం సుమారు 6.3 కోట్ల ఎంఎస్ఎంఈ లు పని చేస్తున్నాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటున్నాయి. ఇండియా జీడీపీ లో వీటి వాటా 30% నికి సమానం. మరో వైపు దేశ మొత్తం ఎగుమతుల్లో కూడా ఈ సంస్థల వాటా 45% మేరకు ఉంటోంది. పైగా ఈ రంగం దేశంలోనే వ్యవసాయ రంగం తర్వాత అత్యంత అధిక మంది జీవనోపాధిని కల్పిస్తోంది. సుమారు 12 కోట్ల మంది ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, మాయదారి కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల వీరి వ్యాపారం జీరో కు పడిపోయింది. మెజారిటీ సంస్థలు 10 మంది కంటే తక్కువ ఉద్యోగులతో నడుస్తాయి. ఈ నేపథ్యంలో వారికి జీతాలు చెల్లించలేక, వ్యాపారం జరగక తీవ్ర ఇబ్బందులకు లోనయ్యాయి. ఇందులో చాలా వరకు సంస్థలు సొంత పెట్టుబడితో నడుస్తున్నవే. వాటికి సరైన డాకుమెంట్స్ లేవనో.. ఓనర్ల కు సరైన సిబిల్ స్కోర్ లేదనో, సరైన పూచీ కత్తు లేదనో, గారంటీ లేదనో బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు రావటం లేదు.
ప్రయోజనం 10% లోపే..
దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఈ రంగం ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో కూడా పూర్తిగా ప్రయోజనం పొందే అవకాశం లేదు. నిన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన ప్రకారమే కేవలం 45 లక్షల సంస్థలు రూ 3 లక్షల కోట్ల రుణాలకు అర్హులవుతారని స్పష్టమవుతోంది. ఈ సంఖ్య మొత్తం ఎంఎస్ఎంఈ ల సంఖ్య 6.3 కోట్ల తో పోల్చితే కేవలం 7% నికి మాత్రమే సమానం. అంటే ఇంత భారీ స్థాయిలో పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తామని చెప్పినా ... అవి కేవలం 10% లోపు కంపెనీలకే ప్రయోజనం చేకూరుస్తుంటే దేశం మొత్తం ఎలా ముందుకు పోతుందో అనే సందేహాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం పెద్ద సంస్థలు మాత్రమే రుణాలను పొందే అవకాశం ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా కాకుండా... 6.3 కోట్ల మందికి ఆయా సంస్థల వార్షిక టర్నోవర్ ఆధారంగా ఒక పరిమితి వరకు వర్కింగ్ కాపిటల్ రుణాలు మంజూరు చేస్తే అందరికీ ప్రయోజనం జరిగేదని అభిప్రాయపడుతున్నారు.