ఐటీ రంగం దెబ్బతింటుందని కర్నాటక సీఎంకు కిరణ్ మజుందర్ షా హెచ్చరిక
కర్ణాటకలోని దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ఇతర మతాలకు చెందిన వ్యాపారస్థులు ఉండటానికి వీలులేదని ఆ రాష్ట్రంలోని అనేక దేవాలయాల కమిటీలు ప్రకటిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలపై ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా స్పందించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో మతపరంగా పెరుగుతున్న విభజన విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ(ITBT) రంగాల్లో అంతర్జాతీయంగా కర్ణాటక నాయకత్వం వహిస్తోందని, రాష్ట్రంలో ఇలాంటి మతపరమైన విభజన వస్తే ITBTలో మన నాయకత్వం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. వెంటనే ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు.
కర్నాటక ఎప్పుడు సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని కలిగి ఉందని, ఇప్పుడు వ్యాపారులపై మతపరమైన ఆంక్షలు పెట్టడాన్ని అనుమతించకూడదని చెప్పారు. ITBTకి మతం అంటుకుంటే అది కర్నాటక ప్రపంచ నాయకత్వాన్ని దెబ్బతీస్తుందన్నారు. మా ముఖ్యమంత్రి చాలా ప్రగతిశీల నాయకుడని, ఆయన త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తాడని కోరుకుంటున్నట్లు తెలిపారు.