ఏప్రిల్ నుండి రూ.40 లక్షల కోట్లు ఆర్జించారు, 10 ఏళ్లలో రిటర్న్స్ ఎంత అంటే?
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక కార్యకలాపాలు, మార్కెట్లు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పుంజుకున్న సంకేతాలు కనిపించాయి. దీంతో నవంబర్ నెలలో ఈక్విటీలు జంప్ చేశాయి. కరోనా ముందుస్థాయికి చేరుకోవడమే కాకుండా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 44వేల మార్క్ దాటగా, నిఫ్టీ 13,000కు చేరువలో ఉంది. కొద్ది రోజుల క్రితమే 43వేల మార్కును దాటిన సెన్సెక్స్, నేడు (నవంబర్ 17) 44వేల మార్కును అందుకుంది. మార్చిలో కరోనా, లాక్ డౌన్ కారణంగా మార్కెట్లు కుప్పకూలాయి. తొమ్మిది నెలల్లో కరోనా ముందుస్థాయికి చేరడంతో పాటు పైపైకి ఎగిశాయి.
2021లో మొబైల్ ఛార్జీల మోత, భారీగా పెరగనున్న టారిఫ్! వీఐ బాటలో ఎయిర్టెల్
మూడేళ్ల కనిష్టానికి...
మార్చి నెలలో లాక్డౌన్ ప్రకటించడంతో మార్కెట్లు మూడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో 26వేల దిగువకు వచ్చిన సెన్సెక్స్ ఇప్పుడు నలభై నాలుగు వేల పాయింట్లకు చేరువ కావడంతో.. ఈ కాలంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్క్యాప్ రూ.40 లక్షల కోట్లు పెరిగింది. ఏప్రిల్ నుండి నవంబర్ నెల మధ్య వరకు ఈ స్థాయిలో పెరిగింది. రిలయన్స్, టీసీఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వంటి వెయిటేజీ కలిగిన స్టాక్స్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది.
క్రమంగా అన్ని రంగాలు జంప్
ప్రారంభంలో కొన్ని రంగాలు మాత్రమే వేగంగా పుంజుకున్నాయి. కరోనా ప్రభావం హాస్పిటాలిటీ, టూరిజం, విమానయానం వంటి రంగాలపై ఎక్కువగా పడగా, ఐటీ రంగంపై తక్కువగానే ఉంది. దీంతో ఇటీవలి కాలంలో ఐటీ స్టాక్స్ జంప్ చేశాయి. అలాగే కరోనా సమయంలో ఎఫ్ఎంసీజీ, ఆన్ లైన్ స్టాక్స్ ఎగిశాయి. ఆ తర్వాత క్రమంగా అన్ని రంగాలు పుంజుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, మెటల్ సహా వివిధ రంగాలు పుంజుకున్నాయి. వచ్చే ఏడాది సెన్సెక్స్ యాభై వేల మార్క్ దిశగా దూసుకెళ్తోందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2024-2025 నాటికి సెన్సెక్స్ లక్ష పాయింట్లకు చేరుకోవచ్చునని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
10 సంవత్లలో 7.57 శాతం కాంపౌండ్ రిటర్న్స్
ఇదే పరిస్థితి కొనసాగితే 2020లో సెన్సెక్స్ 45,000 మార్కుకు, 2021 చివరినాటికి 50,000కు చేరుకోవచ్చునని చెబుతున్నారు. గత పది సంవత్లలో సెన్సెక్స్ 7.57 శాతం కాంపౌండ్ రిటర్న్స్, డాలర్ టర్మ్లో 2.09 శాతం ఇచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నవంబర్ 2వ తేదీ నుండి 13వ తేదీ మధ్య FPIలు రూ.29,436 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. రూ.5,673 కోట్లు డెట్లో ఉన్నాయి. అంతకుముందు నెలలో ఇది రూ.22,033 కోట్లుగా ఉంది.