ఊగిసలాటలో మార్కెట్లు: పేటీఎంలో రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు మీకు రూ.3వేలు మిగులుతాయ్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్ 15) స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఊగిసలాటలో ఉన్నాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. రేపు సాయంత్రం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. దేశీయంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీ గరిష్టాల నుండి తగ్గాయి. ఇది కాస్త సానుకూల అంశం. అయితే చైనాలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. ఇది విదేశీ ఇన్వెస్టర్లు అక్కడి నుండి వైదొలిగి ఆ నిధులను భారత్కు మళ్లించేందుకు అవకాశంగా మారవచ్చు. గత కొద్ది రోజులుగా FIIలు పెద్ద ఎత్తున విక్రయించారు.
అనుకూలం, ప్రతికూలం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ఆశలు, చైనాలో లాక్ డౌన్ కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్కు నిధులు మళ్లిస్తారనే ఆశలు, చమురు ధరల తగ్గుదల ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరచగా, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రంగా ఉండటం, ద్రవ్యోల్భణ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపువంటి అంశాలు ప్రతికూలంగా మారుతున్నాయి.
ఊగిసలాటలో మార్కెట్
సెన్సెక్స్ నేడు భారీ ఊగిసలాటలో ఉంది. ఉదయం 56,663.87 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,720.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,265.27 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,900.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,927.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,807.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి సెన్సెక్స్ 6.65 (-0.01%) పాయింట్లు క్షీణించి 56,445.34 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10.35 (0.061%) పాయింట్లు క్షీణించి 16,860.95 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
పేటీఎం పతనం
పేటీఎం స్టాక్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పేటీఎం కరోనా ఒమిక్రాన్ వేవ్ సమయంలో ఐపీవోకు వచ్చింది. అప్పుడు మార్కెట్లు నష్టపోవడంతో పేటీఎం కూడా నష్టపోయింది. దీనికి తోడు పేటీఎం ఇష్యూ ధర వ్యాల్యూ కంటే ఎక్కువగా ఉందనే కారణంతో ఈ స్టాక్ దాదాపు ఎప్పుడూ కోలుకోలేదు. క్రమంగా కోలుకుంటున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మార్కెట్ పైన పడింది. దీంతో అన్ని స్టాక్స్తో పాటు పేటీఎం పతనమైంది. ఇప్పుడు పేమెంట్స్ బ్యాంకులో పర్యవేక్షణపరమైన లోపాలను గుర్తించామని, కొత్త ఖాతాలు తెరువవద్దని ఆర్బీఐ ఆంక్షలతో మరింత పడిపోయింది.
నేడు పేటీఎం స్టాక్ దాదాపు మరో 10 శాతం మేర పతనమై రూ.613 వద్ద ట్రేడ్ అయింది. పేటీఎం ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు మూడింట ఒకవంతు డబ్బులు కూడా మిగలవు. ఉదాహరణకు పేటీఎం ఐపీవోలో పాల్గొని రూ.2150 ఇష్యూ ధరతో ఒక్కో స్టాక్ను కొనుగోలు చేస్తే, ఇప్పుడు ఆ స్టాక్ రూ.613కు పతనమైంది. నిన్న 13 శాతం, నేడు 10 శాతం పడిపోయింది. ఐపీవోలో రూ.2150 పెడితే ఇప్పుడు వారి చేతికి రూ.613 మాత్రమే వస్తాయి. రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ చేతికి రూ.3,000 మాత్రమే వస్తాయి.