భారత్కు మూడీస్ మరో షాక్, మోడీ ప్రభుత్వం ముందు పెను సవాళ్లు
భారతదేశ సార్వభౌమ రుణ రేటింగ్ను తగ్గించిన మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మరో షాక్ ఇచ్చింది. కరోనా -లాక్ డౌన్ తర్వాత దేశంలో రిటైల్, స్మాల్ బిజినెస్ రుణాలలో క్షీణత నమోదవుతుందని పేర్కొంది. భారత సార్వభౌమ రేటింగ్ తగ్గించడానికి కారణాలు వివరిస్తూ గత మూడు నాలుగేళ్లుగా మందగమనం, సంస్కరణలు అమలు సరిగాలేకపోవడం, కరోనా -లాక్ డౌన్ వంటి వివిధ కారణాలు వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థకు నష్టాలు పెరగనున్నాయని పేర్కొంది.
ఇన్ఫోసిస్లో 74 మంది కోటీశ్వరులు, వారికి ప్రమోషన్లు లేవు
అంతకుముందే ఒత్తిడిలో వివిధ రంగాలు
కరోనా మహమ్మారికి ముందే మందగమనం కారణంగా కొన్ని రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని మూడీస్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు సమీప భవిష్యత్తులో మరింత ఒత్తిడిలోకి వెళ్తాయని తెలిపింది. ఇవి బ్యాంకు రుణాల్లో 10 శాతం నుండి 15 శాతం వరకు ఉంటాయని వెల్లడించింది. అలాగే, బ్యాంకు రుణాల్లో ప్రయివేటు పవర్ సెక్టార్ రుణాలు 8 శాతం నుండి 10 శాతం ఉంటాయని తెలిపింది. ఇందులో ప్రయివేటు బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
పాలకుల ముందు పెను సవాల్
ఇప్పుడు రిటైల్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ (SME) రుణాల నాణ్యత క్షీణిస్తుందని మూడిస్ పేర్కొంది. ఇది మొత్తం రుణాలలో 44 శాతం వరకు ఉంటుందని వెల్లడించింది. మందగమనం, కరోనా - లాక్ డౌన్ కారణంగా బలహీన వృద్ధి రేటు, బలహీనమైన ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక రంగంపై పెరుగుతున్న ఒత్తిడి వంటి వివిధ సవాళ్లు పాలకుల ముందు ఉన్నాయని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలకు నష్టాలు పెరుగుతున్నాయని తెలిపింది.
రుణభారం అధికం
మిగతా ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత రుణభారం ఎక్కువగా ఉందని మూడిస్ తెలిపింది. కరోనాకు ముందే దేశంలో మందగమనం ఉందని గుర్తు చేసింది. బలహీనమైన ఆర్థిక వ్యవస్థకు తోడు వివిధ అంశాలు ఆందోళనకర అంశాలని అభిప్రాయపడింది. రోజురోజుకు పాలకులకు సవాళ్లు పెరుగుతున్నాయని, అదే సమయంలో సంస్కరణలు అంత వేగంగా లేకపోవడం ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది.