'మా ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం 2నెలల వేతనం ఇస్తుందని భావించాం'
కరోనా మహమ్మారి-లాక్డౌన్ నేపథ్యంలో రూ.20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీలో భాగంగా MSMEలకు రుణాలు సహా రూ.3,70,000 కోట్ల ప్రయోజనం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్యాకేజీపై ఇండస్ట్రీ భిన్నంగా స్పందించింది. ఈ ప్యాకేజీ నిష్ప్రయోజనమని, ఇదో జిమ్మిక్కు అని కొన్ని ఎంఎస్ఎంఈ బాడీస్ చెప్పగా, ఈ ప్యాకేజీ బాగుందని, లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ ఉన్నాయని, చేతుల్లో లిక్విడిటీ ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. MSMEలకు ఊతమిచ్చేందుకు 12 నెలల మారటోరియం, 4 ఏళ్ల కాలపరిమితితో రూ.3 లక్షల రుణాలు ప్రకటించారు. ఇది 45 లక్షల చిన్న వ్యాపారులకు ప్రయోజనమని చెబుతున్నారు.
కంపెనీలకు పీఎఫ్ చెల్లింపుపై భారీ ఊరట, మరో 3 నెలలు కేంద్రమే చెల్లిస్తుంది
శాలరీ మద్దతు కోరుకున్నాం
పలు చిన్న సంస్థలు ఈ ప్యాకేజీపై పెదవి విరిచాయి. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి, నగదు ప్రవాహం లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో తమ కార్మికులకు, సిబ్బందికి వేతన మద్దతు ఆశించినట్లు చెప్పాయి. ఆర్డర్లు లేక ఆదాయాలు కనిష్టానికి పడిపోయాయని చెబుతున్నాయి. పరిశ్రమ వెంటిలెటర్పై ఉందని, ఇప్పుడు ఆక్సిజన్ అవసరమని, కానీ కేవలం మూడు నెలలు పని చేసే మెడిసిన్ మాత్రమే సరిపోదని ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (FISME) ప్రెసిడెంట్ అనిమేష్ సక్సేనా అన్నారు. 'ఇప్పుడు (ఎంఎస్ఎంఈలకు) కావాల్సింది ఆక్సిజన్, వెంటనే వెంటిలెటర్ అవసరం. దీనిని మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎంఎస్ఎంఈలకు వెంటిలెటర్ అవసరం. తక్షణ మద్దతు లేదా ప్రయోజనం లేకుంటే వ్యాపారం 3-4 నెలలు నెగ్గుకు రాలేరు' అన్నారు.
పీఎఫ్ పైన...
ఈ ప్రకటనతో నిరాశకు గురయ్యామని, అంతిమంగా వచ్చిన ప్రయోజనం ఏమంటే కేవలం హామీ లేకుండా రుణాలు మాత్రమేనని, మిగతావన్నీ నిరుపయోగమని సక్సేనా అన్నారు. ఇలాంటి తీవ్ర సంక్షోభ సమయంలో ఇది ఆశించిన ప్యాకేజీ కాదన్నారు. ఉద్యోగులకు PF ప్రభుత్వమే చెల్లించే అంశంపై స్పందిస్తూ.. ఇది ఎక్కువ ఎస్ఎంఎస్ఈలకు ప్రయోజనం కలిగించదన్నారు. మరో మూడు నెలలు పొడిగించారన్నారు. కేవలం 100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకే ఇది వర్తిస్తుందన్నారు. అది కూడా రూ.15,000 వేతనం ఉన్న ఉద్యోగులు 90 శాతం ఉండాలన్నారు.
కనీసం ఉద్యోగుల 2 నెలల వేతనాలు చెల్లించాలి
రుణ ఆఫర్, ఇతర ప్రయోజనాలు కేవలం జిమ్మిక్ అని SME చాంబర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చంద్రకాంత్ షాలుంఖే అన్నారు. ఈ రుణాల వల్ల ఆర్థిక పరిపుష్టి కలిగిన ఎంఎస్ఎంఈలు మాత్రమే నిలదొక్కుకుంటాయన్నారు. కానీ ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్న కంపెనీలకు ప్రయోజనం లేదన్నారు. ఉద్యోగులకు కనీసం రెండు నెలల వేతనాన్ని ప్రభుత్వం చెల్లించాలని తాము ఆశిస్తున్నామని చెప్పారు.
ఎంఎస్ఎంఈలకు బూస్టింగ్ ప్యాకేజీ
ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంస్థలతో పాటు దీనిని స్వాగతించిన వారు కూడా ఉన్నారు. ఎంఎస్ఎంఈలకు ఇది బిగ్ బూస్టింగ్ అని చాలామంది అభిప్రాయపడ్డారు. చిన్న వ్యాపారులకు మంచి ప్యాకేజీ ప్రకటించారని భావిస్తున్నామని, ఈ ఉద్దీపన వల్ల ఉద్యోగాల సృష్టి, స్వావలంభనపై దృష్టి పెట్టారని గౌతమ్ అదానీ అన్నారు. MSMEsకు ఇది బిగ్ బూస్టింగ్ అని, కోవిడ్ అంశాన్ని పక్కన పెడితే వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పవన్ గోయెంకా అన్నారు.
ఇండియా వెన్నెముఖకు అండ
MSMEలు ఇండియాకు వెన్నెముక వంటివని, కేంద్రం ప్యాకేజీ వల్ల ఈ కంపెనీలు తమ కాళ్లపై తాము నిలదొక్కుకునే సహకారం లభిస్తుందని స్నాప్డీల్ సీఈవో కునాల్ బాహ్ల్ అన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముఖ అయినటువంటి ఎంఎస్ఎంఈలకు నిర్మల బలమైన ఉత్సాహం ఇచ్చారని JSW గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ సజ్జన్ జిందాల్ అన్నారు.