హెరిటేజ్ ఫుడ్స్ నష్టం రూ.210 కోట్లు, నారా బ్రాహ్మణి ఏం చెప్పారంటే
చంద్రబాబు నాయుడు ఫ్యామిలికీ చెందిన హెరిటేజ్ ఫుడ్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.652 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పన్ను తర్వాత రూ.210 కోట్ల నష్టం (స్టాండాలోన్ నెట్ లాస్) ఉన్నప్పటికీ, సర్దుబాటు తర్వాత రూ.10 కోట్ల నికర లాభం నమోదయింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి రూ.2,725 కోట్ల ఆదాయం నమోదయింది. పన్ను తర్వాత నష్టం రూ.168 కోట్లు, సర్దుబాటు తర్వాత లాభం రూ.63 కోట్లకు పైగా నమోదయింది.
ముఖ్యమంత్రి గారూ! జోక్యం చేసుకోండి: తొలగింపు, వేతనాల కోతపై ఐటీ ఉద్యోగుల ఫిర్యాదు
50 శాతం డివిడెండ్
కంపెనీ డైరెక్టర్ల బోర్డు, వాటాదారులకు 50 శాతం డివిడెండ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్కు రూ.2.50 చొప్పున ఇస్తారు. నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో వాటాదారుల అనుమతి మేరకు డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏకీకృత ప్రాతిపదికన (సర్దుబాటుకు ముందు) రూ.210 కోట్ల నష్టాన్ని చూసింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.24 కోట్ల నికర లాభం ప్రకటించింది.
డెయిరీ వ్యాపారంలో వృద్ధి
సమీక్ష త్రైమాసికానికి (జనవరి-మార్చి) ఆదాయం రూ.706 కోట్ల నుండి రూ.791 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఆదాయంపై రూ.168 కోట్ల నష్టాన్ని (సర్దుబాటుకు ముందు) ప్రకటించగా, అంతకుముందు ఏడాది రూ.2,655 కోట్ల ఆదాయంపై రూ.82.59 కోట్ల లాభం ప్రకటించింది. గత ఏడాది డెయిరీ వ్యాపారంలో 8.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.
నారా బ్రాహ్మణి ఏం చెప్పారంటే
గత ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, మరింతమంది వినియోగదారులను ఆకర్షించడం ద్వారా డెయిరీ వ్యాపారం పెరిగిందని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. కొన్ని రవాణా ఇబ్బందులు తప్పించి లాక్ డౌన్ ప్రభావం కంపెనీపై అంతగా లేదన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయన్నారు. కరోనా-లాక్ డౌన్ వల్ల పాలు, డెయిరీ ఉత్పత్తుల వీధి విక్రయాలు తగ్గాయన్నారు. మొత్తంగా వార్షిక ఆదాయాల్లో 8.4 శాతం వృద్ధి నమోదయినట్లు తెలిపారు.