GST Council: ఆ బాధ్యత ఇకపై స్విగ్గి, జొమాటోలదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్నులు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ - జీఎస్టీ)ను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వేర్వేరు ట్యాక్సులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. వేర్వేరు పన్నులకు బదులు జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్, మద్యం వంటి కొన్నింటిని మినహాయిస్తే.. మిగిలినవన్నీ జీఎస్టీ పరిధిలో కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని చవి చూస్తోంది.
ఇప్పటిదాకా గరిష్ఠంగా 1,42,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త దారులను వెదుక్కుంది. జీఎస్టీ పరిధిని మరింత విస్తరింపజేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదిన్నర కాలంగా ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయం తెలిసిందే. సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత మళ్లీ ఊపందుకున్నాయి జీఎస్టీ వసూళ్లు.
దీన్ని మరింత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ సర్వీసులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇది ఊహించిందే. దీనికోసం ప్రస్తుతం ఉన్న ఈ ప్లాట్ఫామ్స్ సర్వీసుల్లో స్వల్పంగా మార్పులు చేసింది. స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీసులను అయిదు శాతం శ్లాబ్లో చేర్చింది.
స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కు సొంతంగా రెస్టారెంట్లు లేవు. అవి డెలివరీ కంపెనీలు మాత్రమే. వినియోగదారులు.. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా తమకు ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని తెప్పించుకుంటారు. అలా ఆ రెస్టారెంట్లకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు- దానికి సంబంధించిన బిల్లులో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని వసూలు చేస్తోంది. ఈ విధానంలో మార్పలు చేసింది కేంద్రం. రెస్టారెంట్లలో చెల్లించే బిల్లుపై జీఎస్టీని తొలగించింది. ఆ మొత్తాన్ని డెలివరీ సర్వీసులకు బదలాయించింది.
రెస్టారెంట్లల్లో చెల్లించే బిల్లు మీద వసూలు చేస్తోన్న జీఎస్టీని ఇకపై డెలివరీ బిల్లులో చేర్చింది. ఈ విధానం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల వినియోగదారుల మీద ఎలాంటి భారం పడబోదని జీఎస్టీ కౌన్సిల్ భరోసా ఇచ్చింది. రెస్టారెంట్లలో జీఎస్టీ చెల్లింపును తొలగించి- దాన్ని డెలివరీ బిల్లులో చేర్చినట్లు తెలిపింది. కొత్త విధానం ద్వారా సిగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు.. వినియోగదారుల నుంచి జీఎస్టీ మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉంటుంది.
కాగా- పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందంటూ వార్తలొచ్చాయి. జీఎస్టీ పరిధిలో లేదు ఇది. ఫలితంగా- పెట్రోల్, డీజిల్ ధరలపై వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా పన్నులు వసూలవుతున్నాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చి పెట్టేవి కావడంతో ఒక్కో రాష్ట్రం ఒక్కోలా తమ రాబడికి అనుగుణంగా వాటిపై అమ్మకపు పన్నులు, ఇతర ట్యాక్స్లను విధించాయి. వాటి ద్వారా ఖజానాను నింపుకొనే ప్రయత్నం చేస్తోన్నాయి. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి చేర్చే విషయంపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించలేదు.