IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
ఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో LICని పబ్లిక్ ఇష్యూకు తెచ్చే లక్ష్యంతో ఉన్న కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసున్నది. సంస్థ ఆథరైజ్డ్ క్యాపిటల్ గణనీయంగా రూ.25 వేల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. దీంతో రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 2,500 కోట్ల షేర్లను IPOలో ఉంచే వీలు కలుగుతుంది. అయితే, నిబంధనల ప్రకారం మొత్తం ఒకేసారి ఇష్యూలో ఉంచాల్సిన అవసరం ఉండదు. అవసరాన్ని బట్టి దశల వారీగా 2,500 కోట్ల షేర్లను విక్రయించే వెసులుబాటు కలుగుతుంది. దీనికి బోర్డ్ అనుమతి తప్పనిసరి కాదు. ప్రస్తుతం, 29 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న LIC పెయిడప్ క్యాపిటల్ రూ.100 కోట్లుగా ఉంది.
1956లో రూ.5 కోట్ల ప్రారంభ మూలధనంతో ప్రారంభమైన LICకి ప్రస్తుతం రూ.31,96,214.81 కోట్ల వ్యాల్యూ చేసే ఆస్తులు ఉన్నాయి. LIC చట్టం 1956లో ప్రతిపాదించిన సవరణ ప్రకారం LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ వాటా మూలధనం రూ.25 వేల కోట్లుగా ఉండనుంది. ఒక్కో ఈక్విటీ షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.10 చొప్పున 2,500 కోట్ల షేర్లను విభజించే అవకాశముంది.

బడ్జెట్ 2021లో ప్రతిపాదించిన సవరణల మేరకు లిస్టింగ్ నిర్వహణ బాధ్యతలను చూసుకునేలా స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ఓ బోర్డుని ఏర్పాటు చేస్తారు. మొత్తం 27 సవరణలను ప్రతిపాదించారు. లిస్టింగ్ అనంతరం తొలి అయిదేళ్ల పాటు సంస్థలో 75 శాతం వాటాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఆ తర్వాత ప్రభత్వం శాశ్వతంగా 51 శాతం వాటాలను అట్టిపెట్టుకొని నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇందులో సబ్స్క్రైబర్లకు 10 శాతం వాటాల్ని రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ గత పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు.