10 లక్షల కంపెనీలకు షాక్: ఇకపై ప్రతి మూడు నెలలకు ఫలితాల వెల్లడి!
దేశంలోని లక్షల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతోంది. అన్-లిస్టెడ్ కంపెనీలు అన్నీ కూడా ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్థిక ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే బడ్జెట్ లోనే ఈ మేరకు ప్రతిపాదనలు పెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనంలో వెల్లడించింది. దీంతో కంపెనీల్లో గుబులు మొదలయ్యింది.దేశంలోని లక్షల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతోంది. అన్-లిస్టెడ్ కంపెనీలు అన్నీ కూడా ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్థిక ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే బడ్జెట్ లోనే ఈ మేరకు ప్రతిపాదనలు పెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనంలో వెల్లడించింది. దీంతో కంపెనీల్లో గుబులు మొదలయ్యింది.
ఇప్పటికే రకరకాల చట్టాలు, పన్నుల భారాన్ని మోపిన కేంద్రం... ఇకపై ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఆర్థిక ఫలితాలను వెల్లడించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం లోకి జారుకున్న ప్రస్తుత తరుణంలో సాధారణ బిజినెస్ కూడా నడవక సతమతమవుతున్న కంపెనీలపై మరో భారం మోపితే కష్టమేనని కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్యలు ప్రభుత్వ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తూట్లు పొడిచేలా ఉంటున్నాయని వారు పేర్కొంటున్నారు.
మందగమనం వదిలేసి, ఇన్వెస్ట్ చేయండి: పారిశ్రామికవేత్తలతో మోడీ
ఏడాదికి ఒకటి..
ప్రస్తుతం దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న లిస్ట్ కాని కంపెనీలు (అన్ - లిస్టెడ్) ఏడాదికి ఒకసారి మాత్రమే వాటి వార్షిక ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. అది కూడా ఆడిటింగ్ తర్వాత ఆర్థిక సంవత్సరం నుంచి 6 నెలల వరకు సమయం ఉంటుంది. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహణ తర్వాత మరో 30 రోజుల్లో ఫైనాన్సియల్ స్టేట్ మెంట్ నమోదు చేసే అవకాశం ఉంది. అన్ లిస్టెడ్ కంపెనీలు అంటే... స్టాక్ మార్కెట్లలో నమోదు కాని అన్ని ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అన్నమాట. ప్రస్తుతం కేవలం స్టాక్ మార్కెట్లో నమోదు ఐన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మాత్రమే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్థిక ఫలితాలను వెల్లడించాలన్న నిబంధన ఉంది. కొత్త నిబంధన అమలు చేసేందుకు కంపెనీలు అధిక మొత్తంలో వ్యయాలను భరించాల్సి ఉంటుంది.
10 లక్షల కంపెనీలపై ప్రభావం..
ఇండియా లో రిజిస్టర్ అయి ఆక్టివ్ గా ఆపరేషన్స్ నిర్వహిస్తున్న కంపెనీల సంఖ్య సుమారు 11 లక్ష నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. రెండు మూడేళ్ళ లో కేంద్ర ప్రభుత్వం సుమారు 3 లక్షల డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇకపోతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన కంపెనీలు కేవలం 10,000 వరకు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం వీటికి మాత్రమే మూడు నెలల నిబంధన అమల్లో ఉంది. కానీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు కొత్త నిబంధన అన్ని కంపెనీలకు వర్తింపజేస్తే... మరో 10 లక్షలకు పైగా కంపెనీలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిబంధన పాటించాలంటే అన్ లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా కంపెనీ సెక్రటరీ, ఛార్టర్డ్ అకౌంటంట్ల కు అధిక మొత్తంలో వార్షిక వేతనాలు చెల్లించాల్సి వస్తుంది. నిర్వహణ భారం విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు.
చట్టంలో మార్పులు...
కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకు రావాలంటే భారత కంపెనీల చట్టం, 2013 కు సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. కాగా, ప్రభుత్వ నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డొల్ల కంపెనీలను నిర్వహించే వారికి ప్రస్తుత నిబంధనలు చాలా అనుకూలంగా ఉన్నాయని, కంపెనీల్లో భారీ కుంభకోణాలు కూడా వీటి ఆధారంగానే జరుగుతున్నాయని చెబుతున్నారు. కంపెనీలు దివాళా తీస్తున్నట్లు అవి ప్రకటిస్తే గానీ ప్రస్తుతం తెలియటం లేదు. అందుకే ఇకపై అన్ని కంపెనీలు, వాటి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించేందుకు మూడు నెలలు లేదా ఆరు నెలలకోసారి తప్పనిసరిగా ఆర్థిక ఫలితాలు వెల్లడించే నిబంధన తీసుకొచ్చే యోచనలో ఉందని అంటున్నారు.