India Export: ఫిబ్రవరిలో 22 శాతం పెరిగిన ఎగుమతులు
భారత మర్చంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఏడాది ప్రాతిపదికన ఫిబ్రవరి 2022లో 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 27.63 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు మర్చంటైజ్ ఎగుమతులు 45.80 శాతం పెరిగి 374.05 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. గత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2020 ఏప్రిల్ నుండి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో 256.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
అదే సమయంలో దిగుమతులు 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 176.07 బిలియన్ డాలర్లుకు పెరిగింది. 2020.21 ఏప్రిల్-ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 88.99 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

ఇంజినీరింగ్, పెట్రోలియం, కెమికల్ రంగాలు ఆశాజనక పనితీరు కనబరచడం కలిసి వచ్చింది. అలాగే ఇదే నెలలో భారత్ 55 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్య లోటు 21.19 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 2021లో నమోదయిన 13.12 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పోలిస్తే పెరిగింది.