ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజా దాటితే పంచ్ పడుతుంది జాగ్రత్త.. ఎప్పటినుంచో తెలుసా?
సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే జాతీయ రహదారుల వెంట ప్రయాణించాల్సిందే. వీటిపై వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఉండే టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని బట్టి టోల్ వసూలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. టోల్ చెల్లించడానికి ప్రతి వాహనం కొంత సమయం అక్కడ ఆగాల్సి ఉంటుంది. పండగలు, లేదా ఇతర సందర్భాల్లో ఎక్కువ వాహనాల రాకపోకలు జరగడం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతాయి. దీనివల్ల వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతాయి.
అంతేకాకుండా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరుగుతుంది. పెద్ద నగరాలూ, ఎక్కువ వాహనాలు వెళ్లే మార్గాల్లో ప్రతిరోజు టోల్ ప్లాజాల వద్ద వాహన రద్దీ పెరగడం వల్ల ప్రయాణికుల సమయం కూడా వృధా అవుతోంది. ఇది నిత్య కృత్యంగా మారిన నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అవరోధాలు లేకుండా సులభతరంగా టోల్ ను చెల్లించేందుకు ఫాస్టాగ్ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీన్ని వాడటం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని నిలుపకుండానే టోల్ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. ఇదే వాహనదారులకు ఎంతో ప్రయోజనం కల్పిస్తుంది. ఇప్పుడు ఫాస్టాగ్ సదుపాయం కలిగిన టోల్ ప్లాజాల సంఖ్యను మరింతగా పెంచుతున్నారు. వీటి వల్ల మరింతగా ఇబ్బందులు తగ్గనున్నాయి.
డిసెంబర్ 1 నుంచి...
* నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసి) ప్రోగ్రాం కింద డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కేవలం ఫాస్టాగ్ ల ద్వారానే జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులను అనుమతించనున్నారు. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా ఫాస్టాగ్ లైన్ల గుండా వాహనం వెళితే మాత్రం రెండింతల టోల్ ను వసూలు చేయనున్నారు. అందుకే వాహన దారులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
*ఒక వేళ ఫాస్టాగ్ లేనట్టయితే నాన్ ఫాస్టాగ్ వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఒక హైబ్రిడ్ లైన్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు అమలవుతున్న మాదిరిగా టోల్ చెల్లించి వెళ్ళవచ్చు. ఇది మనం వెళ్లే దారిలో పూర్తిగా ఎడమ వైపు ఉంటుంది.
* ఎన్ హెచ్ ఏ ఐ ఏర్పాటు చేసిన ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి ఫాస్టాగ్స్ ను కొనుగోలు చేయవచ్చు.
* ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్, పేటీఎం పెమెంట్స్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లతో పటు ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ఫాస్టాగ్స్ ను విక్రయిస్తోంది.
* దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై 537 ఫాస్టాగ్ టోల్ ప్లాజాలను అందుబాటులోకి తెచ్చారు.
ఫాస్టాగ్ అంటే ?
* ఫాస్టాగ్ అనేది ఒక ప్రీపెయిడ్ టాగ్. దీన్ని వాహనాల విండ్ స్క్రీన్ పై అతికించాల్సి ఉంటుంది. వాహనం టోల్ ప్లాజా వద్దకు వెళ్ళగానే ఎంత టోల్ చెల్లించాల్సి వస్తుందో ఆ మేరకు టోల్ మొత్తం ఆటోమేటిగా చెల్లింపు జరుగుతుంది.
* రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
* ఫాస్టాగ్ ను సేవింగ్స్ ఖాతాకు లేదా వాలెట్ కు అనుసంధానం చేసుకోవడం ద్వారా తగిన మొత్తాన్ని సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
* ఫాస్టాగ్ పేపర్లో చిప్ తో పాటు ఆంటీనా ఉంటాయి. దీని ద్వారానే టోల్ ప్లాజా వద్ద చెల్లింపులు జరుగుతాయి.
* ఫాస్టాగ్ పొందాలంటే ఫాస్టాగ్ జారీ చేసే సంస్థకు కే వై సి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వాహన ఆర్ సి కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఉచితంగా...
* ఫాస్టాగ్ ల వినియోగాన్ని పెంచేందుకు గాను నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) ఉచితంగా ఫాస్టాగ్స్ ఇవ్వనుంది.అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద మాత్రం 150 రూపాయలు తీసుకోనున్నారు. డిసెంబర్ 1 వరకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. డిసెంబర్ తర్వాత చార్జీలను వసూలు చేయనున్నారు.
5 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయల అంచనా
* వచ్చే ఐదేళ్ల కాలంలో ఎన్ హెచ్ ఏ ఐ వార్షిక ఆదాయం లక్ష కోట్ల రూపాయలను తాకుతుందని భావిస్తున్నారు. వచ్చే రెండేళ్లలోనే టోల్ రెవెన్యూ 30,000 కోట్లను తాకవచ్చని అంచనా వేస్తున్నారు.