బొగ్గు ధర పెరుగుదల, కొరత: నెల రోజుల పాటు అన్నీ క్లోజ్, కరెంట్ లేక అంధకారంలోకి..
బొగ్గు ధరల పెరుగుదల, బొగ్గు కొరత, ఇంధన పెరుగుదల వంటి వివిధ కారణాలతో సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను నెల రోజుల పాటు క్లోజ్ చేయాలని సూరత్ ఇండస్ట్రీ నిర్ణయించింది. 'బొగ్గు కొరత-ధరల పెరుగుదల, రసాయనాల ధరల పెరుగుదల వలన ఉత్పన్నమయ్యే ఇంధన సంక్షోభం ఉత్పాదక వ్యయాలు పెరగడానికి దారి తీసింది. దీంతో సూరత్లోని అనేక మిల్లు యజమానుల నవంబర్ నెల వరకు డైయింగ్ అండ్ ప్రింటింగ్ మిల్లులు మూసివేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన గుజరాత్ టెక్స్టైల్ ప్రాసెసింగ్ అసోసియేషన్(SGPTA) సమావేశంలో ఈ సూచనలు వచ్చాయి' అని చెబుతున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో వలస కార్మికులు అప్పుడు తమ సొంత రాష్ట్రాలకు(ఊళ్లకు) వెళ్లారు. అప్పుడు కూడా పరిశ్రమ ఇలాంటి మందగనాన్ని ఎదుర్కొంది.
ఇప్పుడు ధరలు పెరిగి, బొగ్గు కొరత కారణంగా మరోసారి పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. దక్షిణ గుజరాత్ టెక్స్టైల్ ప్రాసెసింగ్ అసోసియేషన్(SGTPA) అధ్యక్షుడు జీతుభాయ్ వఖారియా మాట్లాడుతూ.. అక్టోబర్ 8వ తేదీన జరిగిన సమావేశంలో కలర్స్, కెమికల్స్, కోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో మిల్లు యజమానులు కర్మాగారాలను ఒక నెల పాటు మూసివేయాలని సూచించారని, డైయింగ్, ప్రింటింగ్ ఛార్జీలు పెంచడానికి వస్త్ర వ్యాపారులు అంగీకరించడం లేదని, ఈ సమస్య పైన చర్చించేందుకు నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ 20వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని చెప్పారు.
నెల రోజుల పాటు క్లోజ్ చేయాలని
సాధారణంగా నేత కార్మికులు గ్రే దుస్తులను టెక్స్టైల్ ట్రేడర్స్కు విక్రయిస్తారు. తర్వాత వాటిని మిల్లులకు పంపిస్తారు. అక్కడ డైయింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్ పూర్తి చేస్తారు. డైయింగ్, ప్రింటింగ్ యూనిట్లలో బాయిలర్స్ బొగ్గును ఉపయోగించి స్టీమ్ను ఉత్పత్తి చేస్తారు. ఇందులో ఎక్కువగా భాగం దిగుమతి చేసుకుంటారు. ఏదేమైనప్పటికీ బొగ్గు కొరత కారణంగా కలర్ కెమికల్స్ ధరలు మూడు రెట్లు పెరిగాయి. దీంతో టెక్స్టైల్ మిల్లు యజమానులు SGTPAతో సమావేశం నిర్వహించారు. డైయంగ్, ప్రింటింగ్ మిల్లులలను నవంబర్ 1వ తేదీ నుండి ఒక నెల పాటు మూసివేయాలని అభ్యర్థించారు.
ఇది టఫ్ టైమ్
స్థానిక లక్ష్మీపతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని సంజయ్ సరోగీ మాట్లాడుతూ.. ఇండోనేసియా నుండి దిగుమతి చేసుకునే బొగ్గును ఎక్కువగా పరిశ్రమలో ఉపయోగిస్తామని, కానీ పదిహేను రోజుల క్రితం ఈ ఇంపోర్టెడ్ బొగ్గు ధర ఒక టన్నుకు రూ.4000 నుండి రూ.5000 పెరిగిందని, దీంతో ఈ ధర రూ.15,000కు చేరుకుందని చెప్పారు. సాధారణంగా స్టీమ్ ఉత్పత్తికి టెక్స్టైల్ ఇండస్ట్రీకి 30 నుండి 35 టన్నుల బొగ్గు అవసరమవుతుందని తెలిపారు. దిగుమతి చేసుకునే బొగ్గుతో పాటు సూరత్, భరూచ్లోని లిగ్నైట్ కోల్ను కూడా టెక్స్ టైల్ మిల్స్లో వినియోగిస్తారని, కానీ ఈ బొగ్గుతో స్టీమ్ కాస్త తక్కువ వస్తుందని, అందుకే ఎప్పుడైనా ప్రత్యామ్నాయంగా మాత్రమే వినియోగిస్తామన్నారు. ఇగ్నైట్ కోల్ ధర టన్నుకు రూ.5000 వరకు ఉంటుందని, ఇది కూడా ప్రస్తుతం రూ.12000కు పెరిగిందన్నారు. ఇగ్నైట్ కోల్ కూడా ప్రస్తుతం కొరతగా ఉందని, ప్రస్తుతం తమకు చాలా కఠినమైన సమయమని చెప్పారు.
అంధకారంలోకి పలు రాష్ట్రాలు!
ఇదిలా ఉండగా, దేశ రాజధాని న్యూఢిల్లీ, పంజాబ్తో పాటు పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయని అంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు రవాణాకు ఆటంకం ఏర్పడింది. దిగుమతి చేసుకుంటున్న విదేశీ బొగ్గు ధర అధికంగా ఉండటంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్స్ సామర్థ్యంలో సగం కంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో పవర్ ప్లాంట్స్ విద్యుత్ ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి. దేశీయ విద్యుత్ అవసరాల్లో దాదాపు 70 శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు అవసరాన్ని తీరుస్తున్నాయి. మొత్తం 135 థర్మల్ ప్లాంట్స్లో సగానికి పైగా కేంద్రాల్లో నెలలో పదిహేను రోజులు అవసరానికి అనుగుణంగా బొగ్గు నిల్వలు ఉండేవి. ఇప్పుడు రెండు రోజుల మేరకే ఉన్నాయని చెబుతున్నారు. బొగ్గు కొరతతో పంజాబ్లోని పలు థర్మల్ ప్లాంట్స్లో కరెంట్ కోత విధించారు. పలు కేంద్రాల్లో రొటేషన్ లోడ్ షెడ్డింగ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. రాజస్థాన్లో ప్రతి రోజు ఒక గంట విద్యుత్ కోత అమలు చేస్తున్నారు.
గుజరాత్లో 1,850 మెగావాట్ల విద్యుత్, పంజాబ్లో 475 మెగావాట్ల విద్యుత్, రాజస్థాన్లో 380 మెగావాట్ల విద్యుత్, మహారాష్ట్రలో 760 మెగావాట్ల విద్యుత్, హర్యానాలో 380 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు టాటా పవర్ కాంట్రాక్టు పొందింది. కానీ గుజరాత్ ముంద్రా ప్లాంటులో కరెంట్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా కాంట్రాక్టును టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్కు ఉంది. రొటేషనల్ పవర్ కట్స్ ఉండవచ్చునని టాటా పవర్ శనివారమే వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు మరో ఒకటి రెండు రోజులు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు. జార్ఖడ్, బీహార్ రాష్ట్రాల్లో మాదిరి ఢిల్లీలో విద్యుత్ కొరత ఉండవచ్చుననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో 190 మెగా యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. రాష్ట్ర అవసరాల్లో 45 శాతం విద్యుత్ ఉత్పత్తి ఏపీ జెన్కో ద్వారా జరుగుతోంది. కానీ రెండు రోజుల వరకు మాత్రమే బొగ్గుకు స్టాక్స్ ఉన్నాయి.