Chip shortage: పండుగ సీజన్లో ఆటో కంపెనీలకు చిప్స్ షాక్
సాధారణంగా ప్రతి రంగం కూడా పండుగ సీజన్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ఈ ఏడాది పండుగ సీజన్ వచ్చేసింది. ఈ కాలంలో వాహనాల విక్రయాలు భారీగా పెరుగుతాయి. కానీ చిప్స్ కొరత ఆటో రంగానికి నష్టాన్ని తెచ్చేలా కనిపిస్తోంది. వివిధ కంపెనీలు ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిప్స్ షార్టేజ్ పండుగ సీజన్ సేల్స్ పైన భారీ ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయని టాటా మోటార్స్ పీవీ హెడ్ శైలేష్ చంద్ర అన్నారు. పండుగ సీజన్లో అమ్మకాలు పెరుగుతాయనే భావనతో ఆటో సంస్థలు సహా అన్ని వ్యాపార సంస్థలు సంతోషంగా ఉంటాయి. కానీ ఈసారి వాహన కంపెనీలకు మాత్రం ఖేదం మిగిలేలా ఉంది. కార్లకు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ చిప్స్ కొరత కారణంగా సరఫరా చేయలేకపోవడమే. గత కొద్ది నెలలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఇప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. పైగా ఎక్కువ అవుతోంది. దీంతో వాహన కంపెనీలు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తోంది. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉత్పత్తిలో కోత పెడుతున్నట్లు తెలిపింది. అందుకే ఈ నెలలో కార్ల ఉత్పత్తి బాగా తగ్గిపోనుంది.
ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వల్ల ఆగస్ట్ నెలలో అమ్మకాలపై ప్రభావం పడిందని, పరిష్కారం కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. సెమీ కండక్టర్స్ సమస్య తీవ్రంగా ఉందని మహీంద్రా కూడా పేర్కొంది. ఈ సంస్థ ఆగస్ట్ కార్ల అమ్మకాల్లో పదిహేడు శాతం వృద్ధి నమోదు చేసింది. థార్, ఎక్స్యూవీ 300, బొలెరో నియో మోడల్స్కు అధిక డిమాండ్ కనిపించింది. చిప్స్ కొరత వల్ల సెప్టెంబర్ నెలలో ఆటోమోటివ్ డివిజన్ ప్లాంట్స్లో ఏడు రోజుల పాటు ఉత్పత్తి కలిపి వేస్తామని, కార్ల ఉత్పత్తి 25 శాతం తగ్గే అవకాశముందని తెలిపింది. తెలంగాణలోని జహీరాబాద్తో పాటు మహారాష్ట్రంలోని చకన్, నాసిక్, కండివలి, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ప్లాంట్స్ ఉన్నాయి.
చిప్స్ సెట్స్ను ఓఈఎం వెండర్స్ నుండి కాకుండా బహిరంగ విపణిలో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆటో కంపెనీలు అంటున్నాయి. ఫోర్ట్, ఎంజీ మోటార్, రెనో, నిస్సాన్ వంటి కార్ల కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తిని తగ్గించాయి. సెమీ కండక్టర్స్ ఉత్పత్తి అధికంగా ఉన్న తూర్పు ఆసియా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించడంతో, చిప్స్ కొరత ఇంకా ఎక్కువ అయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివరికి లేదా 2022 ప్రారంభం నాటికి ఈ సమస్య తీరుతుందని భావిస్తున్నారు
చిప్స్ కొరత వాహనాల ఉత్పత్తిపై పడుతోంది. ఉత్పత్తిపై పడిన ప్రభావం ఆయా వాహన కంపెనీల స్టాక్స్ పైన కూడా గతవారం కనిపించింది. సెమీ కండక్టర్స్ షార్టేజ్ కారణంగా తమ ఉత్పత్తిలో 25 శాతం కోత విధిస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. తమ ఆటో కంపెనీ సెమీ కండక్టర్స్ కొరతను ఎదుర్కొంటోందని, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా ఈ సమస్య మరింత పెరిగింది రెగ్యులేటరీ ఫైలింగ్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల తెలిపింది. దీంతో సెప్టెంబర్ 2021లో తమ కంపెనీ దాదాపు ఏడు రోజుల పాటు నో ప్రొడక్షన్ డేస్ (ఉత్పత్తి లేని రోజులు)గా ఉంటుందని తెలిపింది. దీంతో 2021 సెప్టెంబర్ నెలలో ఇరవై శాతం నుండి ఇరవై ఐదు శాతం ఉత్పత్తి కోత పడుతుందని తెలిపింది. అయితే ట్రాక్టర్లు, ట్రక్స్, బస్సులు, త్రీవీలర్స్ వ్యాపారంపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. ఆగస్ట్ నెలలో దేశీయ మార్కెట్లో 15,973 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది మహీంద్రా అండ్ మహీంద్రా. గత ఏడాది ఇదే కాలంలో 13,651 వాహనాలను విక్రయించింది. అంటే ఏడాది ప్రాతిపదికన 17 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఈ వారం మొదట్లో మారుతీ సుజుకీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. హర్యానా, గుజరాత్లలోని ప్లాంట్స్ సెమీకండక్టర్ల సమస్యను ఎదుర్కోవచ్చునని అభిప్రాయపడింది. ఆగస్ట్ నెలలో వాహన విక్రయాలు పెరిగాయని, కానీ డిమాండ్ మేరకు విక్రయాలు జరపలేకపోయామని, ఇందుకు చిప్స్ కొరత కారణమని మారుతీ సుజుకీ ప్రకటించింది. 2020 ఆగస్ట్ నెలతో పోలిస్తే ఈ ఆగస్ట్లో దాదాపు కార్ల కంపెనీలు అన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో అమ్మకాలు నమోదు చేశాయి. కానీ కార్ల అమ్మకాలపై చిప్స్ కొరత ప్రభావం పడింది.