Chip shortage: తయారీ రంగం అల్లకల్లోలం: అంచనాలు తలకిందులు
ముంబై: చిప్..ఓ చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. మనం రోజూ వినియోగించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కార్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర హోమ్ అప్లయన్సెస్ తయారీలో వినియోగించే ఈ పరికరం మానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను దారుణంగా దెబ్బకొడుతోంది. సెమీకండక్టర్స్ చిప్ షార్టేజ్ (Chip shortage) ఆటోమొబైల్ రంగాన్ని కుదేల్ చేసింది. స్మార్ట్ఫోన్ల తయారీపైనా దీని ప్రభావం పడింది. వాహనాలు, ఎలక్ట్రానిక్ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రపంచం మొత్తాన్నీ సెమీకండక్టర్స్ చిప్స్ కొరత పట్టి పీడిస్తోంది.
ఆ ఒక్క షేర్లో రూ.లక్ష పెట్టుబడి: 48 లక్షల రూపాయలు లాభం
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్
సెమీకండక్టర్ చిప్స్ వినియోగం ఆటోమొబైల్ సెక్టార్లో కీలక పాత్ర పోషిస్తోన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లలో వినియోగించే సర్కుట్లల్లో వీటిని వాడుతుంటారు. కార్ల తయారీలో చిప్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్ కంట్రోల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్, డిస్ప్లే, ఓడోమీటర్ యూనిట్లు పనిచేయాలంటే చిప్ల అవసరం ఉంటుంది. చివరికి వైపర్ పని చేయాలన్నా కూడా చిప్ అవసరమౌతుంది. గేర్లు అవసరం లేని ఆటోమేటిక్ కార్లు రోడ్ల మీదికి వచ్చిన తరువాత.. ఆటోమొబైల్ సెక్టార్లో చిప్లకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది.
ఎలక్ట్రానిక్స్ పరికరాలు పనిచేయాలంటే..
ఓ కారు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుని ప్లాంట్ నుంచి బయటికి వచ్చిందంటే.. చిప్ లేనిదే అది సాధ్యమే కాదు. కార్ల తయారీలో ఎలక్ట్రానిక్ సర్యుట్ల వినియోగంతోనే చిప్లకూ డిమాండ్ ఏర్పడుతూ వచ్చింది. జీపీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి అప్గ్రేడ్ వెర్సన్ కార్లల్లో ఎలక్ట్రానిక్ సర్కుట్లు అవసరమౌతాయి. ఈ సర్కుట్ పనిచేయాలంటే చిప్, సెమీకండక్టర్లు అత్యవసరం. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత చిప్ల తయారీకి బ్రేక్ పడింది.
చిప్ దిగుమతి..
భారత్లో చిప్, సెమికండక్టర్ల తయారీ చాలా తక్కువ. చాలావరకు చిప్లను దిగుమతి చేసుకుంటోన్నాయి భారత్లోని మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన వస్తవులను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో చిప్స్, సెమికండక్టర్ల వాటా కూడా అధికంగా ఉంటోంది. చిప్లను తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ సంస్థలు అధికంగా ఉత్పత్తి చేస్తోన్నాయి. వాటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి.
చిప్ల ప్రొడక్షన్స్ ఎలా ఉన్నాయ్..
ఆయా దేశాలతో పాటు భారత్ కూడా ఇప్పుడిప్పుడే చిప్ల ప్రొడక్షన్ మీద దృష్టి సారించింది. చిప్ల కొరత.. ఇప్పటికే వాహన రంగాన్ని కుదేల్ చేస్తోన్న విషయం తెలిసిందే. చాలినన్ని చిప్స్ అందుబాటులో లేకపోవడం వల్ల మారుతి సుజుకి వంటి టాప్ కార్ మాన్యుఫాక్చరర్స్ కంపెనీ సైతం తన ప్రొడక్షన్ను కుదించుకోవాల్సిన పరిస్థితిని చవి చూసింది. ఇప్పటికీ డిమాండ్కు అనుగుణంగా చిప్స్ దొరకట్టేదనే అభిప్రాయాలు మార్కెట్లో వర్గాల్లో నెలకొని ఉన్నాయి. కొందరు దీన్ని కృత్రిమ కొరతగా భావిస్తోన్నారు. ఉద్దేశపూరకంగా చిప్ల కొరతకు కారణం అయ్యారనీ అంటున్నారు.
జియోఫోన్ నెక్స్ట్కు సైతం..
మొబైల్ హ్యాండ్ సెట్ సెక్టార్లో మచ్ అవైటెడ్గా అనిపించిన జియోఫోన్ నెక్స్ట్.. ఆవిష్కరణ వాయిదా పడటానికి కూడా చిప్స్ కొరత కారణమైంది. జియోఫోన్ నెక్స్ట్ వాయిదా పడటంతోనే చిప్స్ అవసరం ఏ స్థాయిలో ఉందో వెలుగులోకి వచ్చింది. ఇదివరకు మారుతి సుజుకి కూడా తన కార్ల తయారీని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా జియోఫోన్ నెక్స్ట్ కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పటికైనా కొరత తీరేనా..
శనివారం గ్రాండ్గా నిర్వహించాల్సి ఉన్న జియోఫోన్ నెక్స్ట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రిలయన్స్ యాజమాన్యం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీపావళి పండగ సీజన్లో ఈ ఫోన్ను ప్రజల ముందుకు తీసుకొస్తామని పేర్కొంది. దసరా-దీపావళి సీజన్లో దీన్ని తీసుకుని రావడానికి చురుగ్గా ప్రయత్నిస్తోన్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్రకటనలో పొందుపరిచింది. చిప్ల కొరత కారణంగా- జియోఫోన్ నెక్స్ట్ను వాయిదా వేసినట్లు తెలిపింది. ఆశించిన స్థాయిలో చిప్లు అందుబాటులో ఉండట్లేదని స్పష్టం చేసింది. అప్పటికైనా చిప్ల కొరత తీరకపోవచ్చు.