జనవరి 1 నుండి టోల్ ప్లాజా వద్ద కొత్త నిబంధన, ఇక నగదుకు చెల్లు!
జనవరి 2021 నుండి జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను నగదురహితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 1వ తేదీ నుండి టోల్ గేట్ల వద్ద 100 శాతం వసూళ్లను ఫాస్టాగ్ ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం టోల్ చెల్లింపుల్లో దాదాపు 75 శాతం ఫాస్టాగ్స్ ద్వారా జరుగుతున్నాయి. ఒక లైన్లో మాత్రమే నగదు రూపంలో చెల్లింపులకు అనుమతి ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం నుండి వంద శాతం ఫాస్టాగ్ ఉండే అవకాశముంది. అంటే నగదు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి వాహనదారులు ముందే జాగ్రత్తపడటం మంచిది.
ఈ సేవింగ్ అకౌంట్ ఉందా? డిసెంబర్ 12 నుండి మారుతున్న రూల్
నగదురహిత ట్రాన్సాక్షన్స్ కోసం..
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ప్రకారం స్మార్ట్ ట్యాగ్స్ను త్వరగా జారీ చేయడానికి, వాటిని రీఛార్జ్ చేయడానికి వీలుగా సిబ్బందిని నియమించుకుంటున్నారు. కొద్దిమంది నగదు రూపంలో చేసే చెల్లింపులు టోల్ ప్లాజాల వద్ద సాఫీగా జరిగే ప్రయాణంపై ప్రభావం చూపుతున్నాయని, ఈ నేపథ్యంలో నగదురహిత చెల్లింపుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందని చెబుతున్నారు.
పెరుగుతున్న డిజిటల్ టోల్
ఫాస్టాగ్ కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో ఏకంగా రూ.702.86 కోట్ల డిజిటల్ టోల్ కలెక్షన్లు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలో రూ.658.94 కోట్లుగా ఉంది. నవంబర్ కలెక్షన్లు అంతకు మించి ఉండే అవకాశం ఉంది. ఫాస్టాగ్ 100 శాతం తప్పనిసరి సమీపిస్తున్న నేపథ్యంలో డిజిటల్ టోల్ కూడాపెరుగుతోంది.
పాస్టాగ్ తప్పనిసరి
కాగా, ఫోర్ వీలర్స్, అంతకంటే పెద్ద వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయాలంటే జనవరి 1వ తేదీ నుండి, థర్డ్ పార్టీ బీమా రెన్యూవల్కు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఫాస్టాగ్ తప్పనిసరి. ఈ మేరకు రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనలు తీసుకు వచ్చాయి. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించే లక్ష్యంతో కేంద్రం 2017లో ఫాస్టాగ్ విధానాన్ని తెచ్చింది. ఆ తర్వాత ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తోంది.