ప్రయివేటీకరణకు సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
కేంద్ర ప్రభుత్వం రెండు బ్యాంకులను ప్రయివేటీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నీతి అయోగ్ ఇటీవల పలు బ్యాంకులను సిఫార్స్ చేసింది. తాజాగా ఇందులో నుండి రెండు బ్యాంకులను షార్ట్ లిస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల ప్రయివేటీకరణకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించి నిర్ణయం వెలువడనుంది.
ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI)ల యాజమాన్యం త్వరలో చేతులు మారనున్నాయి. ప్రయివేటీకరణలో భాగంగా ఈ రెండు బ్యాంకుల ఈక్విటీలో తొలుత 51 శాతం వాటాను ప్రయివేటు సంస్థలకు విక్రయించాలని నీతి ఆయోగ్ సిఫార్స్ చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలోని కార్యదర్శుల కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ కమిటీ సిఫార్సు ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రయివేటీకరణను సులభం చేసేందుకు స్వచ్చంధ పదవీ విరమణ పథకం కూడా ముందుకు తెస్తోంది ప్రభుత్వం.
ప్రయివేటీకరణ వార్తలతో సోమవారం సెంట్రల్ బ్యాంక్, ఐఓబీ షేర్లు NSEలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ బ్రేకర్లను తాకాయి. సెంట్రల్ బ్యాంక్ షేర్ 20 శాతం లాభంతో రూ.24.30 వద్ద, ఐఓబీ షేర్ 20 శాతం లాభంతో రూ.23.60 స్థాయికి చేరుకొని 52 వారాల గరిష్ఠస్థాయి వద్ద ముగిశాయి. ఈ రెండు కౌంటర్లలో ట్రేడింగ్ వాల్యూమ్స్ సోమవారం పెరిగాయి. ఈ వార్తలతో సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లన్నీ సగటున 4 శాతం వరకు లాభాలు నమోదు చేశాయి.