చిన్న కంపెనీల కోసం పెద్ద ఫండ్: ప్రభుత్వ యోచన!
చిన్న కంపెనీలు, వ్యాపారాలను నడపటం అంత సులువు కాదు. తమ కాళ్లపై తాము నిలబడాలని, అదే సమయంలో మరో నలుగురికి పని కల్పించాలన్న ఉద్దేశం తో చాలా మంది ఔత్సాహక పారిశ్రామికవేత్తలు చిన్న కంపెనీలను స్థాపిస్తారు. కానీ వాటిని నడిపించేందుకు అవసరమైన కాపిటల్ (మూలధనం) లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. తొలిసారి వ్యాపారాల్లోకి ప్రవేశించిన వారి ఇబ్బందులు మరీ వర్ణనాతీతం. అయినా సరే ముందుకే వెళుతుంటారు. ప్రభుత్వం నుంచి అనేక పథకాలు అందుబాటులో ఉన్నా... ఏవో సాకులు చెబుతూ వాటిని ఎలా ఇవ్వకూడదో ప్రభుత్వ అధికారులకు బాగా తెలుసు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ముద్ర యోజన పథకం కొంత వరకు చిన్న కంపెనీల అవసరాలను తీర్చిందనే చెప్పాలి.
అయితే, అది మాత్రమే సరిపోదని... సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) అభివృద్ధి పథం లో దూసుకుపోయేందుకు అవసరమైన మద్దతు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే వీటి కోసం ఒక భారీ నిధి (ఫండ్) ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో చిన్న కంపెనీల మూలధన నిధుల కొరత, వర్కింగ్ కాపిటల్ సర్దుబాటు చేయ వచ్చని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. సెబీ మాజీ చైర్మన్ యూకె సిన్హా కమిటీ సూచించిన విధంగా ఒక ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్ఓఎఫ్) ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిని వచ్చే బడ్జెట్ సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
రూ 10,000 కోట్లు ...
దేశంలో ఇప్పటికే ఒక ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటయింది. అది స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులకు ఉద్దేశించినది. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులకు మూలధనం అందించటంతో పాటు స్టార్టుప్ కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఫండ్ ను వినియోగిస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా అలాంటిదే మరో రూ 10,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేయాలని... దాన్ని ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ ల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగించాలని యోచిస్తున్నారు. సిడ్బీ నేతృత్వం లో ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. ఇదే విషయాన్ని సిన్హా కమిటీ కూడా 2019 జూన్ లోనే తెలియజేసింది. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ ఫండ్ అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం గట్టిగ నిర్ణయించినట్లు సమాచారం.
2% వడ్డీ రాయితీ...
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం చిన్న కంపెనీలకు మరో వెసులుబాటు కూడా కల్పించాలని భావిస్తోంది. కొత్త రుణాలు తీసుకున్నప్పుడు, అలాగే ప్రస్తుత లోన్ల పై ఇంక్రిమెంట్ రుణాలు తీసుకున్నప్పుడు .. వాటిపై 2% వడ్డీ రాయితీ అందించాలని భావిస్తోంది. అయితే ఇది కొత్త పథకమేమి కాదు కానీ... దీనిని మరికొంత కాలం కొనసాగించాలని యత్నిస్తోంది. ఈ వడ్డీ రాయితీ కేవలం జీఎస్టీ నమోదిత కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. గత ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకం గురించి హామీ ఇచ్చారు కూడా. చిన్న కంపెనీలు దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు దోహదపడతాయి. అదే సమయంలో దేశం నుంచి జరిగే ఎగుమతుల్లో దాదాపు సగం వాటా చిన్న కంపెనీలది ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటికి వీలైనంత అధికంగా ఆర్థిక చేయూత అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
రూ 12,000 కోట్ల కేటాయింపులు...
మరో వైపు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ... తమకు ఈ ఏడాది కేటాయింపుల్లో కనీసం రూ 12,000 కోట్లు కేటాయించాలని కోరుతోంది. ఈ మేరకు బడ్జెట్ లో ప్రతిపాదించాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కోరింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ శాఖ కు రూ 7,011 కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించారు. ఇప్పటి వరకు ఈ శాఖకు కేటాయించిన నిధుల్లో ఇవే అత్యధికం కావటం విశేషం. ప్రస్తుతము మన దేశ జీడీపీ లో చిన్న, మధ్యతరహా కంపెనీల వాటా 29% గా ఉంది. వచ్చే ఐదేళ్ల లో దీనిని 50% నికి చేర్చాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే దానికి అనుగుణంగా అధిక మొత్తంలో నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.