నేనైతే ఆదాయపుపన్ను రద్దు చేస్తా: నిర్మలమ్మకు స్వామి సంచలన సూచన, FD వడ్డీ రేటు పెంచాలని..
రాజ్యసభ సభ్యులు సుబ్రమణియన్ స్వామి ఆదాయపు పన్ను అంశంపై కేంద్ర ప్రభుత్వానికి బోల్డ్ సూచన చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో స్వామి కీలక సూచన చేశారు. 'బిజినెస్ టుడే' ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఆదాయపు పన్ను గురించి స్పందించారు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆదాయపు పన్నును రద్దు చేయాలని నిర్మలమ్మకు సూచించారు.
భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు పన్ను రద్దు తప్పనిసరిగా ఉండాలన్నారు. కనీసం ఆర్థిక రికవరీ కరోనా ముందుస్థాయికి చేరుకునే వరకైనా ఆదాయపు పన్ను రద్దును కొనసాగించాలన్నారు.

మీరు ఆర్థికమంత్రిగా ఉంటే...
మీరు ఆర్థికమంత్రిగా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేసేవారు అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి సుబ్రమణియన్ స్వామీ పైవిధంగా స్పందించారు. 'వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి, కరోనా నుండి ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక, ఆ తర్వాత దానిని పర్మినెంట్ చేసే అంశంపై ఆలోచిస్తాను' అని స్వామి సమాధానం ఇచ్చారు.

పన్నులకు ప్రత్యామ్నాయం
బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చాక ప్రారంభంలోనే ఈ సలహా ఇచ్చానని, ఆదాయపు పన్ను ద్వారా దాదాపు రూ.4 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, అదే బడ్జెట్ చూసుకుంటే రూ.8 లక్షల కోట్ల నుండి రూ.9 లక్షల కోట్ల మధ్య అవుతుందని, ట్యాక్సేషన్కు బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరులను పెంచుకోవచ్చునని తాను సూచించానని తెలిపారు. ఉదాహరణకు 2జీ లైసెన్స్ వేలం మొదటి వేలం ద్వారానే రూ.4 లక్షల కోట్లు వచ్చిందని, ఇది ఆదాయ పన్నుకు సమానమన్నారు. పన్నులు పెంచడానికి బదులు ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు.

వడ్డీ రేట్లు...
ఆర్థిక వ్యవస్థ గాడిన పడితే ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారని స్వామి అన్నారు. రీ-ఇన్వెస్ట్ చేసిన కంపెనీల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని నిబంధనలు ఉంటే పొదుపు రేటు పెరుగుతుందని, తద్వారా వృద్ధి పెరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోన్స్ పైన వడ్డీ రేటును తగ్గిస్తే బాగుంటుందన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 6 శాతం నుండి 9 శాతానికి పెంచడం ద్వారా ప్రజలు సేవింగ్స్కు ముందుకు వచ్చేలా చేయాలన్నారు.