Budget 2022: విదేశీ కంపెనీలకు కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు ఉంటుందా?
భారత్-యూకే మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ రెండు దేశాలు కూడా ఫ్రీ ట్రేడ్ ఆగ్రిమెంట్(FTA) ప్రకటనతో 2022 కొత్త ఏడాది ప్రారంభమైంది. ఇటీవల చాలా దేశాలు, కంపెనీలు భారత్లో పెట్టుబడులకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో భారత డొమెస్టిక్ పాలసీలో పెట్టుబడులకు సంబంధించి అనుకూల ప్రకటనలు ఉండవచ్చునని చెబుతున్నారు. విదేశీ స్వేచ్ఛా వాణిజ్యం చర్చల నేపథ్యంలో బ్రిటిష్ సంస్థలు, వ్యాపారులు కూడా బడ్జెట్ను నిశితంగా గమనిస్తున్నారు.
ఎఫ్డీఐ ఇన్-ఫ్లో
భారత్ కరోనా మహమ్మారి నుండి క్రమంగా కోలుకుంటోంది. ఆర్థిక పునరుద్ధరణ కోసం ఈ బడ్జెట్లో నిర్మలమ్మ పలు ప్రకటనలు చేయవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి సగటున 9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అన్ని రంగాలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా తయారీ రంగలో 12.5 శాతం వృద్ధిని కనబరుస్తోంది. ప్రపంచంలోని ముఖ్య దేశాల్లో అత్యధిక వృద్ధి అంచనా వేయబడిన వాటిలో భారత్ ముందు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో FDI ఈక్విటీ ఇన్ఫ్లో ఎక్కువగా కంప్యూటర్ అండ్ ఐటీ, ఆటోమొబైల్, సర్వీసెస్ రంగాల్లోకి వచ్చాయి. ఇవి సంవత్సరానికి నాలుగు శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
కార్పోరేట్ పన్ను తగ్గింపు
UKIBC గత నవంబర్ నెలలో UK తరఫున సిఫార్సులు చేసింది. భారత ప్రయోజనాల కోసం వివిధ రంగాల్లో వచ్చే పెట్టుబడులకు సంబంధించిన సంస్కరణలను వచ్చే బడ్జెట్లో చేర్చాలని కోరింది. కరోనా కారణంగా గత బడ్జెట్లో కార్పోరేట్ పన్ను తగ్గింపును గణనీయంగా 22 శాతాన్ని ప్రకటించారు. అయితే వీటిలో విదేశీ వ్యాపారాలు మినహాయించారు. అయితే అంతర్జాతీయ వ్యాపారుల కోసం ఈసారి బడ్జెట్లో సంస్కరణలు కావాలని కోరుతున్నారు.
మరిన్ని...
భారత్ను టెల్కో పారిశ్రామిక విప్లవంలో కేంద్రంగా ఉంచాలనే ప్రభుత్వ ఆశయాలకు మద్దతిస్తున్నామని, డేటా సెట్స్ ప్రవాహాన్ని సులభతరం చేయడం వల్ల ఆకర్షణీయమైన ఆపరేటింగ్ వాతావరణంలో భారత్ స్థానం గణనీయంగా పెరుగుతుందని, అదే సమయంలో అధిక టెలికం రెగ్యులేటరీ ఛార్జీలు, కాపెక్స్ ధర, టెలికం పరికరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటంతో సర్వీస్ ప్రొవైడర్లు ఇబ్బందులు పడుతున్నారని, స్పెక్ట్రం చెల్లింపు, లైసెన్స్ ఫీజు, వినియోగ ఛార్జీలపై మినహాయింపును కవర్ చేసే రేట్ల హేతుబద్దీకరణను కోరుకుంటున్నారని చెబుతున్నారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ పెంపు కోరుకుంటోంది. అప్పుడు టెల్కోలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని, సాంకేతిక బదలీకి మద్దతిస్తుందని చెబుతున్నారు. టెలికంతో పాటు ఈ కామర్స్ సంస్థలు కూడా బడ్జెట్ పైన ఆశగా ఉన్నాయి.
2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల స్థాయికి చేరుకోవడానికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెరగాలని, బడ్జెట్లో దీనికి ప్రాధాన్యత కోరుకుంటున్నారు. పర్యావరణం, సోషల్, గవర్నెన్స్ స్పేస్లో బలమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు అందించాలని చెబుతున్నారు.