మాంద్యం దెబ్బ, మోడీ ప్రభుత్వం PF కొత్త ప్లాన్: లక్షలమందికి చేతికి ఎక్కువ శాలరీ!!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వినియోగం తగ్గి, ఉత్పత్తులు పడిపోయి, వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల వినిమయ శక్తిని పెంచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. వినిమయ శక్తిని పెంచేందుకు, ఆర్థిక మందగమనం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం చెప్పారు. అయితే ఇప్పుడు వినియోగాన్ని పెంచేందుకు తక్కువ ఆదా, మరింత ఖర్చు మంత్రాన్ని తెచ్చేలా కనిపిస్తోంది.
మీ ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే: మోడీకి రఘురాం రాజన్ 'ఆర్థిక' సూచనలు

ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. సంఘటిత రంగంలోని లక్షలాదిమంది ఉద్యోగుల శాలరీ-పీఎఫ్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకొని, టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా ఉండేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇది బేసిక్ శాలరీలో 12 శాతంగా ఉంది. దీనిని ఇప్పుడు తగ్గించుకొని, టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా తీసుకునే వెసులుబాటు ఉద్యోగులకు కల్పించనుంది.

పీఎఫ్ తగ్గి, టేక్ హోమ్ పెరిగితే వినిమయ శక్తి పెరుగుతుందనే...
ఈ మేరకు సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్ 2019లో ఒక ప్రొవిజన్గా ఉది ఉంటుందని కేంద్ర కార్మిక సాఖ తెలిపింది. దీనికి కేబినెట్ ఆమోదం లభించింది. ఈ వారంలో దీనిని పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నట్లు లేబర్ మినిస్ట్రీ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులకు తక్కువ పీఎఫ్, ఎక్కువ టేక్ హోమ్ శాలరీ ఆప్షన్ ఉంటే వ్యవస్థలో వినిమయ శక్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోందట. ఇటీవలి కాలంలో వినియోగం తగ్గి, డిమాండ్ లేక, వృద్ధి రేటు ఏడెనిమిదేళ్ల కనిష్టానికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం పీఎఫ్ అంశంలో కొత్త ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.

బిల్లు పాస్ అయ్యాక..
కేంద్రం పీఎఫ్ను 12 శాతంగానే ఉంచిందని, పీఎఫ్ కాంట్రిబ్యూషన్పై బిల్లును పార్లమెంటులో చర్చించి, పాస్ అయ్యాక నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పీఎఫ్ 12 శాతంగానే ఉన్నప్పటికీ, ఉద్యోగులకు ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అంటే అది వారి ఇష్టం.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనాలు
ఈ బిల్లు ప్రకారం ఓ కంపెనీలో కొంత కాలం పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తిస్తుంది. ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు అందడం లేదు. గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం ఒకే సంస్థలో అయిదేళ్లు పని చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇవ్వాలి.

అధిక రాబడి
ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి నేషనల్ పెన్షన్ స్కీంకు మారే అవకాశాన్ని కల్పించే గత ప్రతిపాదనను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ తొలగించింది. ప్రస్తుత ప్రొవిజన్ ప్రకారం ఈపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన ఉద్యోగులు అధిక రాబడితో పాటు మినహాయింపు - మినహాయింపు - మినహాయింపు స్టేటస్ వంటి బహుళ ప్రయోజనాలు పొందుతాయని పేర్కొంటున్నారు.

ఉద్యోగులకు లబ్ధి జరిగే ప్రతిపాదనలు
ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (ESIC) ప్రస్తుత స్ట్రక్చర్ కొనసాగుతుందని కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిని కార్పోరేట్ పరం చేయాలనే ఆలోచన లేదని తెలిపింది. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించేలా బిల్లును రూపొందించారు. కార్పస్ ఫండ్ ద్వారా ఉద్యోగులకు పెన్షన్, మెడికల్ కవర్, డెత్, దివ్యాంగులకు లబ్ధి చేకూరేలా రూపొందించారు. వివాదాస్పదంగా మారుతాయని భావించిన ప్రొవిజన్లను తొలగించి ఉద్యోగులకు లబ్ధి చేకూరే ప్రొవిజన్లు పొందుపరిచారు.

కనీస ఉద్యోగులు...
ఈ బిల్లు ప్రకారం ఒక సంస్థలో కనీసం 10 మంది ఉద్యోగులు పని చేస్తున్నారంటే వారికి ESIC కింద అన్ని ప్రయోజనాలు బిల్లులో పొందిపరిచారని తెలుస్తోంది. ప్రమాదకర రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది. 10 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉంటే అది ఆయా యాజమాన్యాల ఇష్టం. సోషల్ సెక్యూరిటీ కోడ్లో 8 కార్మిక చట్టాలు ఉన్నాయి. సంస్కరణలు తీసుకొచ్చే భాగంలో కార్మికశాఖ మొత్తం 44 చట్టాలను 4 కోడ్స్లో విభజించింది. అవి వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, రక్షణ మరియు ఆరోగ్యం, పని పరిస్థితులుగా విభజించింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.