HDFC, SBI కస్టమర్లకు ఇబ్బందులపై RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఆర్థిక నిపుణుల అంచనాలు నిజం చేస్తూ వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలను కాస్త సానుకూలంగా సవరించింది. ఇదే సమయంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పందించారు. HDFCబ్యాంకు విస్తరణకు ముందు వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నామని, బ్యాంకు అందుకు కట్టుబడి ఉంటుందని భావిస్తున్నామన్నారు.
కస్టమర్ల సేవలకు ఇబ్బందిలేదు: RBI ఆదేశాలపై HDFC, అసలేం జరిగింది?

HDFC, SBI డిజిటల్ అంతరాయంపై RBI
HDFC బ్యాంకు ఐటీ సిస్టంకు సంబంధించి ఆర్బీఐకి కొన్ని ఆందోళనలు ఉన్నాయని శక్తికాంతదాస్ అన్నారు. మొత్తం మీద బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర రుణదాతలు కస్టమర్లు/ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఐటీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్థలు అన్ని కూడా బలమైన ఐటీ పరిష్కారాలపై మరింత దృష్టి సారించి, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ సిస్టం అంతరాయాన్ని కూడా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఏమైనా సమస్య పరిష్కారం కోసం ఆర్బీఐ కలిసి పని చేస్తోందన్నారు.

ట్రాన్సాక్షన్స్ పరిమితి పెంపు
ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరింత కాంటాక్ట్లెస్ చెల్లింపుల వాడకాన్ని ఊతమిచ్చే చర్యల్లో భాగంగా కాంటాక్ట్లెస్ కార్డు చెల్లింపుల పరిమితినిపెంచాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న కాంటాక్ట్లెస్ కార్డు ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2 వేల నుండి రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. కరోనా సమయంలో సమర్ధ, సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉంటాయన్నారు.
వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాల్ని నిలుపుకోవాలని సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందన్నారు.

కీలక వడ్డీ రేట్లు అంతే
RBI వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు. ద్రవ్యోల్భణం పెరగడం, జీడీపీ ప్రతికూలంగానే ఉండటం వంటి వివిధ కారణాలతో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా నాలుగు శాతంగా ఉంచింది. రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. బ్యాంకు రేటు 4.25 శాతంగా కొనసాగనుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఎంపీసీ మూడు రోజులపాటు సమావేశమైంది. ఇందులో భాగంగా యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించింది. దీంతో రెపో రేటు నాలుగు శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది.