అమెజాన్ అమ్మకాలను వారం రోజుల పాటు బ్యాన్ చెయ్యండి .. డిమాండ్ చేసిన సిఏఐటి .. రీజన్ ఇదే
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ పై కఠిన చర్యలు తీసుకోండి అంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. నిబంధనలు పాటించని అమెజాన్ పై అంత తక్కువ జరిమానా ఎలా విధిస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రభుత్వం విధించిన రూల్ ఉల్లంఘించినప్పటికీ కఠిన చర్యలు తీసుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ ల ఫెస్టివల్ సేల్ ను బ్యాన్ చెయ్యండి .. లేదంటే నష్టం .. నిర్మలకు సిఏఐటి లేఖ

నిబంధనలు ఉల్లంఘించిన అమెజాన్ ... చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లకు తమ ప్లాట్ఫామ్లలో విక్రయించే ఉత్పత్తుల గురించి అవి ఏ దేశంలో తయారయ్యాయి వంటి అన్ని డీటైల్స్ ను కస్టమర్లకు తప్పనిసరిగా ఇవ్వటం లేదని ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా , అందుకు సమాధానం ఇవ్వని , నిబంధనలు పాటించని క్రమంలో అమెజాన్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) .

25 వేల రూపాయల జరిమానా వేసిన సర్కార్ పై మండిపడిన సిఏఐటి
అమెజాన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజానికి కేంద్ర సర్కార్ 25 వేల రూపాయల ఫైన్ విధించింది. వేల కోట్ల వ్యాపారం చేస్తున్న అమెజాన్ కు అంత తక్కువ జరిమానా విధించడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థకు రూ. 25000 ఒక లెక్కనా అంటూ మండిపడింది. నిబంధనలు ఉల్లంఘించిన అమెజాన్ సంస్థపై ఇంకోసారి తప్పు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది . కనీసం వారం రోజుల పాటు అమెజాన్ పై నిషేధం విధించాలని కేంద్ర సర్కార్ ని కోరింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్.

నష్టానికి సమానంగా జరిమానా విధించాలని డిమాండ్ .. వారం పాటు బ్యాన్ చెయ్యండి
అమెజాన్ వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కలిగిన నష్టానికి సమానంగా జరిమానా విధించాలని, వస్తువుల తయారీ వివరాలను ప్రభుత్వానికి, కస్టమర్లకు అందించకుండా తప్పు చేసిన ఈ కామర్స్ సంస్థపై ప్రస్తుతం ఏడు రోజుల బ్యాన్ విధించాలని, మరోమారు తప్పు చేస్తే 15 రోజుల బ్యాంక్ విధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బిసి భార్టియా, సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండే వాలా ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఫెస్టివల్ సీజన్ సమయంలోనూ కేంద్రానికి లేఖ రాసిన సిఏఐటి
గతంలో పండుగ సీజన్ కు ముందు ఫెస్టివల్ సీజన్ అమ్మకాలను నిషేధించాలని జిఎస్టి మరియు ఆదాయపు పన్ను ఎగవేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలను పర్యవేక్షించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాల కారణంగా, దేశీయులు వ్యాపారం చేయలేకపోతున్న కారణంగా మొదటి నుండి అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలపై నిప్పులు చెరుగుతూనే ఉంది సిఏఐటి.