రెడ్జోన్ ఎఫెక్ట్, భారీగా పెరగనున్న బ్యాడ్ లోన్స్: లాక్డౌన్.. పులిమీద స్వారీయే
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బ్యాంకుల వద్ద బ్యాడ్ లోన్స్ పెరిగే అవకాశముందని సీనియర్ ప్రభుత్వ అధికారి, టాప్ ఫోర్ బ్యాంకర్స్ వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ బ్యాంకులు ఇప్పటికే రూ.9.35 లక్షల కోట్ల (123 బిలియన్ డాలర్లు) రుణాలతో ఇబ్బందులు పడుతున్నాయి. సెప్టెంబర్ 2019 నాటికి మొత్తం ఆస్తుల్లో రుణాల శాతం 9.1 శాతంగా ఉంది.
U కాదు V కాదు.. భారత్ ఆర్థిక వ్యవస్థ ఇలా కోలుకుంటుంది
నిరర్థక ఆస్తులు భారీగా పెరిగే అవకాశం
ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల నిరర్థక ఆస్తులు 18% నుండి 20% వరకు పెరగవచ్చునని ప్రభుత్వం అంచనాతో ఉందట. ఎందుకంటే 20% నుండి 25% బకాయి రుణాలు డిఫాల్ట్ ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు. బ్యాడ్ లోన్స్ క్రెడిట్ గ్రోత్ పైన ప్రభావం చూపవచ్చునని, కరోనా మహమ్మారి కారణంగా రికవరీకి కూడా సమయం పట్టవచ్చునని అంటున్నారు. ఇంతకుముందు కంటే ఎన్పీఏలు రెట్టింపు అయ్యే అవకాశముందని టాప్ బ్యాంకులకు చెందిన అధికారులు కూడా చెబుతున్నారట.
రుణాలు.. నగరాల్లో రెడ్ జోన్ ఆందోళన
జూన్ లేదా జూలై నాటికి గానీ ఆర్థిక కార్యకలాపాలు యథావిదిగా కొనసాగే అవకాశాలు లేవని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. రుణాలు ముఖ్యంగా చిన్న మధ్య తరహా వ్యాపారాల రుణాలు 20 శాతం వరకు ఉన్నాయి. వీటి ప్రభావం ఉండవచ్చునని చెబుతున్నారు. ఎందుకంటే దేశంలోని 10 పెద్ద నగరాలు ఎక్కువగా రెడ్ జోన్లోకి వెళ్లి ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని గుర్తు చేస్తున్నారు. అంటే ఉత్పత్తి, డిమాండ్ లేక ఆ కంపెనీలు నష్టాల్లోకి వెళ్తే అవి ఎన్పీఏలుగా మారే ప్రమాదముంది.
రెడ్ జోన్లోనే 83 శాతం క్రెడిట్స్
భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడే నగరాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే బ్యాంకు రుణాల్లో 83 శాతం వాటాను కలిగి ఉన్నాయట. కరోనా కంటే ముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందని, ఇప్పుడు ఈ మహమ్మారి కారణంగా దారుణంగా దెబ్బతింటోందని చెబుతున్నారు. అర్థవంతమైన ఉద్దీపనలు లేకుంటే మరింత ఇబ్బందికరమని అభిప్రాయపడుతున్నారు.
లాక్ డౌన్ పులిమీద స్వారీ లాంటిది
లాక్ డౌన్ జూన్ వరకు పొడిగించినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 20 శాతం కుదించుకుపోతుందని మెకన్సీ అండ్ కో అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 2 శాతం నుండి 3 శాతానికి పడిపోతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలను 180 రోజుల తర్వాత మాత్రమే ఎన్పీఏలుగా చూడాలని బ్యాంకులు ఆర్బీఐను కోరాయి. ఇది ఇప్పటి వరకు 90 రోజులుగా ఉంది. లాక్ డౌన్ అంటే పులిమీద స్వారీ చేయడం లాంటిది అని, ఒక్కసారి కనుక పులి మీద నుండి దిగితే.. అంటే లాక్ డౌన్ ఎత్తివేస్తే క్లిష్టమైన స్థితిలోకి వెళ్లిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.