Aviation News: విమానయానంలోకి కొత్త కంపెనీ.. గోవా కేంద్రంగా స్టార్టప్..
Fly91: దేశీయ విమానయాన రంగంలో మరో కొత్త సంస్థ పుట్టుకొచ్చింది. దీనికి ముందు ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా కంపెనీ ఆకాశ గత ఏడాది కొత్తగా భారత గగనతలంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అయితే తాజాగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ చాకో ఈ రంగంలో అరంగేట్రం చేశారు.
అయితే ప్రస్తుతం కేరళలోని త్రిసూర్కు చెందిన మనోజ్ చాకో నేతృత్వంలోని ఫ్లై91 ఎయిర్లైన్స్ స్టార్టప్ తన ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. విమానయాన రంగంలో మనోజ్ దాదాపు 30 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు. గోవా కేంద్రంగా పనిచేయనున్న కంపెనీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తన కమర్షియల్ ప్రయాణాన్ని ప్రారంభించాలని చూస్తోంది. దీనికోసం ఇప్పటికే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులను పొందింది.
Fly91 పేరుతో కంపెనీ తన సేవలను ప్రారంభించనుంది. పేరులోని 91 భారతదేశ టెలిఫోన్ కోడ్ ను సూచిస్తుంది. రూ.200 కోట్ల ప్రారంభ మూలధనంతో ఫ్లై91 కార్యకలాపాలు ప్రారంభించనుంది. చిన్న పట్టణాల మధ్య ప్రయాణించేందుకు వీలుగా విమాన సర్వీసులను తీసుకురావాలని చూస్తోంది. ఇందుకోసం ఏటీఆర్ 72-76 మోడల్ విమానాలను వినియోగించనుంది. మెుదట లీజుకు తీసుకున్న 6 విమానాలతో ప్రయాణం మెుదలు పెట్టి ఐదేళ్లలో వీటి సంఖ్యను 40కి చేర్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Just Udo Aviation Pvt Ltdగా రిజిస్టర్ అయిన విమాన సంస్థ మొదటి దశలో గోవా, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు.. కర్ణాటకలోని చిన్న విమానాశ్రయాల్లో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో హుబ్లీ, నాసిక్, బెల్గాం, షిర్డీ, మైసూర్, కొల్హాపూర్, షోలాపూర్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాగే తర్వాత కేరళకు కూడా సర్వీసులను విస్తరింపజేస్తామని మనోజ్ చాకో వెల్లడించారు.
కంపెనీ మెయిన్లైన్ క్యారియర్లతో పోటీ పడకుండా కోడ్-షేరింగ్, ఇంటర్లైన్ ఒప్పందాలపై దృష్టి పెడుతుంది. కొత్తగా వస్తున్న Fly91 ప్రారంభం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన UDAN ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ విజయాన్ని ప్రతిబింబిస్తుంది. మార్చి మాసంలో దేశీయ విమానయాన సంస్థలు మెుత్తంగా 13 మిలియన్ల మంది ప్రయాణీకులను తీసుకెళ్లి రికార్డు సృష్టించాయి.