స్మార్ట్ వాటర్ అమ్మకాల్లో ఇండియా దూకుడు: కోకాకోలా
జలం ప్రాణాధారం. దీనిని కొనుక్కొని వినియోగించే రోజులు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. కానీ చాలా వేగంగా పరిణామాలు మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మంచి నీళ్లను కొని తాగుతున్నారు. భారత దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే కేవలం సాధారణ నీళ్ళే కాకుండా ఇప్పుడు స్మార్ట్ జలాలు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అంటే, కేవలం శుద్ధి చేసిన నీళ్ళే కాకుండా వాటికి మినరల్స్, రుచి జోడించి మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు.
ఇప్పటికే భారత మార్కెట్లో ఇలాంటి స్మార్ట్ జల బ్రాండులు చాలానే ఉన్నాయ్. హిమాలయ బ్రాండ్ మంచి నీళ్లు కూడా ఇలాంటివే. కానీ గతేడాది ప్రముఖ బహుళ జాతి శీతల పానీయాల కంపెనీ కోకాకోలా ... 'స్మార్ట్ వాటర్' పేరుతో ప్రత్యేకంగా ఒక బ్రాండ్ నీళ్లను భారత్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. ఆ.... మన దగ్గర నీళ్లు ఎవరు కొంటారు అన్న భారత్ మార్కెట్టే ... ప్రస్తుతం ఈ ప్రపంచ అగ్రగామి కోలా కంపెనీ స్మార్ట్ వాటర్ బ్రాండ్ కు మాత్రం అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని కోకాకోలా కంపెనీయే స్వయంగా ప్రకటించటం విశేషం.
ఒకే పర్సులో రూపే, మాస్టర్, వీసా కార్డులు.. తేడాలేంటో తెలుసా?
రూ 7,000 కోట్లకు పైగా అమ్మకాలు...
కోకాకోలా కంపెనీ కి 1 బిలియన్ డాలర్ (సుమారు రూ 7,000 కోట్లు) బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు కోకాకోలా పానీయం, థమ్స్అప్, స్ప్రైట్ వంటి బ్రాండ్లు కంపెనీ కి ఏడాదికి బిలియన్ డాలర్ల రెవిన్యూ తెచ్చి పెడతాయి. ఇందులో తాజాగా స్మార్ట్ వాటర్ బ్రాండ్ కూడా వచ్చి చేరింది. ఇది కూడా కంపెనీకి ఏడాదికి 1 బిలియన్ డాలర్ల కంటే అధిక రాబడిని ఆర్జించి పెడుతోంది. 1996 లోనే అమెరికాలో ప్రవేశ పెట్టిన స్మార్ట్ వాటర్ బ్రాండ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్ , ఇండియా, గల్ఫ్ మార్కెట్లలో లభిస్తోంది. గ్లాసూ స్మార్ట్ వాటర్ గా దీనిని పిలుస్తున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దీని అమ్మకాలు 4% పెరిగాయని కంపెనీ తెలిపింది. మెరుగైన అమ్మకాలతో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మార్కెట్ గా అవతరించిందని తెలిపింది.
రూ 50 కి 750 ఎంఎల్ ...
డిస్టిల్డర్ వాటర్ కలిగిన స్మార్ట్ వాటర్ లో కాల్షియమ్ క్లోరైడ్, పొటాషియం బైకార్బోనేటే, మెగ్నీషియం క్లోరైడ్ వంటి మినరల్స్ జోడించి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 750 ఎంఎల్ పెట్ వాటర్ బాటిల్ లో ఇది లభిస్తోంది. ఈ బాటిల్ ధర రూ 50 గా నిర్ణయించారు. సాధారణంగా మనకు మార్కెట్లో ఒక లీటర్ వాటర్ బాటిల్ రూ 20 కి లభిస్తుంది. ఇప్పుడు కేవలం మెట్రో సిటీలోనే లభిస్తోన్న స్మార్ట్ వాటర్ బాటిల్ మంచి నీళ్లను దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా 2019 చివరి నాటికి దేశవ్యాప్తంగా సుమారు 90,000 ఔట్లెట్ లలో స్మార్ట్ వాటర్ బాటిల్ అమ్మకాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకొంది.
38% పెరిగిన లాభం...
ఇదిలా ఉండగా... కోకాకోలా కంపెనీ తన మూడో త్రైమాషిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. అందులో కంపెనీ మెరుగైన పనితీరును కనబరిచింది. ప్రపంచమంతా ఆర్థిక మందగమనం, ట్రేడ్ వార్, బ్రెక్సిట్ వంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ కోకాకోలా కంపెనీ ఆర్థిక ఫలితాలు మాత్రం ఆకర్షణీయంగా ఉండటం విశేషం. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు స్థూలంగా 8% పెరిగి 9.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ 66,500 కోట్లు) కు చేరాయి. అదే సమయంలో నికర లాభం ఏకంగా 38% వృద్ధి చెంది 2.6 బిలియన్ డాలర్లు గా (దాదాపు రూ 18,200 కోట్లు) నమోదయ్యింది. ఈ ఫలితాలను చూస్తే మన వ్యూహాలు మన వినియోగదారులు, ఇతర కస్టమర్లు, సిస్టం తో బాగా సమ్మిళితం అవుతున్నాయన్న విశ్వాసం కలుగుతోందని కోకాకోలా కంపెనీ చైర్మన్, సీఈఓ జేమ్స్ క్విన్ సీ పేర్కొన్నారు.