జగన్ 'రూ.3,500 కోట్ల' భారీ ఊరట: రూ.2 లక్షల వరకు ప్రభుత్వమే ఇస్తుంది
హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (MSME)ల కష్టాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్సార్ నవోదయం పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ దీనిని ప్రారంభించారు. దీని ద్వారా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీషెడ్యూల్ చేస్తారు. ఒత్తిడిలో ఉన్న MSMEలను ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీపీఎస్సీ ఉద్యోగాలపై జగన్ సంచలన నిర్ణయం, ఇంటర్వ్యూలు రద్దు
రూ.25 కోట్లు మించరాదు...
తొమ్మిది నెలల్లో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు అందించిన రుణాలను రీషెడ్యూల్ చేసేలా సంబంధిత బ్యాంకులకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. 2020 మార్చి 31వ తేదీలోగా MSME రుణ ఇబ్బందులను తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అయితే ఇక్కడ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన ఓ షరతు ఉంది. 2019 జనవరి 1వ తేదీ నాటికి రుణాలు రూ.25 కోట్లు మించి ఉండరాదని ఆర్బీఐ నిర్దేశించింది.
వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్
రుణాలు రీస్ట్రక్చర్ చేసే తేదీ నాటికి సదరు MSME జీఎస్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో ఉంది. జిల్లాల వారీగా రుణ ఇబ్బందుల్లో ఉన్న MSMEలను గుర్తించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను కూడా నియమించింది. నవోదయం స్కీం కింద 85,000 వేలకు పైగా MSMEలకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.3,500 కోట్లకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ (OTR) ద్వారా పరిష్కారం చూపిస్తారు. అర్హత ఉన్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికల తయారీకి అయ్యే వ్యయంలో 50 శాతం లేదా రూ.2 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే రూ.10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
50 శాతం లేదా గరిష్టంగా రూ.2 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది
ఏపీలో రూ.30,528 కోట్ల పెట్టుబడితో 1,00,629 MSMEలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా 10,84,810 మందికి ఉపాధి లభిస్తోంది. రుణాల ఏకకాల పునర్వ్యవస్థీకరణ (OTR) ద్వారా వీటిని ఆదుకునేందుకు వైయస్సార్ నవోదయం పథకాన్ని ప్రవేశపెట్టారు. రుణ బకాయిలు చెల్లించలేని MSMEలకు OTR కల్పించడంతో పాటు అవసరమయ్యే ఆడిటర్ నివేదిక వ్యయంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.2,00,000 వరకు ప్రభుత్వం భరిస్తుంది. దీంతో రుణ చెల్లింపుకు వారికి గరిష్టంగా ఆరేళ్ల సమయం లభించడంతో పాటు వర్కింగ్ కేపిటల్ సమకూరుతుంది. బ్యాంకర్లతో కలిసి OTRలో రూ.3,493 కోట్ల మేర లబ్ధి చేకూనుందని చెబుతున్నారు.
బ్యాంకు రుణాల చెల్లింపుకు ఆరేళ్ల వ్యవధి
ఏకకాల పునర్ వ్యవస్థీకరణకు వెళ్లిన చిన్న పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీల చెల్లింపులో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి నెల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సలహా కమిటీ, జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశమై పరిశ్రమలను గుర్తిస్తాయి. అన్ని జిల్లాల్లోను రంగాల వారీగా అధ్యయనం చేసి MSMEల బలోపాతానికి చర్యలు తీసుకుంటారు. 2019 జనవరి ఓకటో తేదీ నుంచి ఏకకాల పునర్ వ్యవస్థీకరణకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. గత ప్రభుత్వం దీనిని వినియోగించుకోలేదు. ఏకకాల పునర్ వ్యవస్థీకరణకు వెళ్లే ఎంఎస్ఎంఈలకు బ్యాంకు రుణాల చెల్లింపుకు గరిష్టంగా ఆరేళ్ల వ్యవధి లభించడంతో పాటు వడ్డీ 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుంది.