దూసుకెళ్లిన మార్కెట్లు: 2000 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమై, దూసుకెళ్తున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వృద్ధి తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై భయాలు పెరిగి మార్కెట్లు నిన్న నష్టపోయాయి. అయితే ఈ రోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఉదయం గం.9.45కు సెన్సెక్స్ 113 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడింది. మధ్యాహ్నానికి మార్కెట్లు దూసుకెళ్లాయి.
మధ్యాహ్నం గం.11.18 నిమిషాలకు సెన్సెక్స్ 1,247.88 (3.46%) పాయింట్లు ఎగబాకి 37,341.35 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 351.15 (3.28%) పాయింట్లు పెరిగి 11,055.95 వద్ద ట్రేడ్ అయింది. సాయంత్రానికి సెన్సెక్స్ 1,921.15 (5.32%) పాయింట్లు పెరిగి 38,014.62 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 569.40 (5.32%) పాయింట్లు ఎగిసి 11,274.20 వద్ద ట్రేడ్ అయింది.
ఆర్థికమాంద్యం నేపథ్యంలో తయారీ రంగానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. ఉద్దీపన చర్యల్లో భాగంగా తయారీ రంగ సంస్థలకు కార్పోరేట్ పన్నును 22 శాతానికి ప్రతిపాదిస్తూ నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు.
యస్ బ్యాంకు, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ, హీరో మోటో కార్ప్, అదానీ స్టోర్స్, ఐచర్ మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండియా బుల్స్ షేర్లు దూసుకెళ్లాయి. కోల్ ఇండియా, గెయిల్, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.