బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా? అక్టోబర్ 1 నుంచి సూపర్ ఆఫర్స్
ముంబై: హోమ్ లోన్ లేదా వెహికిల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త! వచ్చే నెల నుంచి ఈ రుణాల చౌక కావొచ్చు. అక్టోబర్ 1వ తేదీ నుంచి వడ్డీ రేటు రుణాలను రెపో రేటు ఆధారితంగా ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులను ఆదేశించింది. దీంతో వచ్చే నెల ప్రారంభం నుంచి హోమ్ లోన్, వెహికిల్ లోన్, మధ్య-చిన్న-సూక్ష్మస్థాయి (MSME) సంస్థకు ఇచ్చే రుణాలను బ్యాంకులు రెపో రేటు ఆధారంగా ఇవ్వాలి. లేదా 3/6 నెలల ట్రెజరీ బిల్లు రాబడి లేదా ఫైనాన్షియల్ బెంచ్ మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించిన ప్రామాణిక రేటు ఆధారంగా జారీ చేయాలి. రెపో రేటు ఆధారంగా ఇస్తే రెపో తగ్గినప్పుడు వడ్డీ భారం తగ్గుతుంది. ఇది కస్టమర్లకు ప్రయోజనం. ఇటీవల వరుసగా రెపో రేటు తగ్గింది.
సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్: అప్లై ఎలా చేసుకోవాలి, ధరలు ఎంత?
ఇక తప్పనిసరి.. తగ్గనున్న వడ్డీ భారం
రుణాల వడ్డీ రేట్లను రెపో రేటు సహా ఇతర బాహ్య ప్రామాణికాలతో అనుసంధానం చేయాలని బుధవారం బ్యాంకర్లను ఆర్బీఐ ఆదేశించింది. రెపో రేటు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ సర్క్యులర్నూ విడుదల చేసింది. ఇందులో గృహ, వ్యక్తిగత, వాహన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (MSME)లకు రుణలభ్యతని సులభతరం చేయాలని సూచించింది. తద్వారా వడ్డీ భారం తగ్గించాలని అభిప్రాయపడింది.
ఎంసీఎల్ఆర్పై అసంతృప్తి... కస్టమర్లకు ఇక సత్వరమే బదలీ..
ప్రస్తుతం ఉన్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (MCLR) నిబంధనావళి ఆశించిన సంతృప్తికరంగా లేదని ఆర్బీఐ పేర్కొంది. కాబట్టి రెపో రేటుకు లింక్ చేయాలని తెలిపింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ను అనుసరించాలని సూచించింది. కీలక వడ్డీ రేట్ల కోత ప్రయోజనాన్ని ఎప్పటికప్పుడు కస్టమర్లకు సత్వరం బదలీ చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.
వడ్డీ రేట్ల సవరణ
ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరించాల్సి ఉంటుంది. ఒక రుణ విభాగానికి ఒక బ్యాంకు కచ్చితమైన ఓ ప్రామాణిక రేటును ఆధారం చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. అది వేర్వేరుగా ఉండవద్దని తెలిపింది. ఏ ప్రమాణాన్ని ప్రమాణంగా తీసుకోవాలన్నది బ్యాంకులు నిర్ణయించుకోవాలని సూచించింది.
ఇప్పటికే తీసుకున్న రుణాలపై....
అలాగే, బ్యాంకుల నిర్వహణ ఖర్చులు మూడేళ్లకోసారి సవరించాలని ఆర్బీఐ సూచించింది. కాగా, MCLR, బేస్ రేటు, BPLR ఆధారితంగా ఇచ్చిన ప్రస్తుత రుణాలు, రుణ పరిమితులు.. చెల్లింపులు పూర్తయ్యే వరకు లేదా పునరుద్ధరించుకునే వరకు కొనసాగుతాయని కూడా స్పష్టం చేసింది.
110 బేసిస్ పాయింట్స్ తగ్గినా...
ఆర్బీఐ గత నాలుగు వరుస ద్రవ్య సమీక్షల్లో రెపో రేటును 110 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మొదటి మూడుసార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున, చివరిసారి 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కానీ బ్యాంకులు మాత్రం రుణాలపై వడ్డీ రేట్లను ఆశించిన స్థాయిలో తగ్గించలేదు. 40 బేసిస్ పాయింట్స్ వరకే తగ్గించాయి. దీనిపై ఆర్బీఐ, ఆర్థిక శాఖ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది.
లాభం ఏమిటి...?
రెపో రేటు ఆధారిత రుణాల వడ్డీరేట్ల వల్ల ఆర్బీఐ ద్రవ్య సమీక్షల్లోని నిర్ణయాల ప్రయోజనాలు హోమ్, వెహికిల్, పర్సనల్, MSME వంటి రుణ గ్రహీతలకు వెంటనే చేరుతాయి. ఇది రుణాలు తీసుకునే వారికి ఎంతో ఊరట. ఇప్పుడు రెపో రేటు చాలా తక్కువగా ఉంది. కాబట్టి రుణాలు తీసుకుంటే ఈఎంఐ భారం కూడా బాగానే తగ్గుతుంది.
తగ్గిన ఐసీఐసీఐ వడ్డీ రేట్లు
రెండో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. ఎంసీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుని అన్ని కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 0.10 శాతం మేర తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.55 శాతానికి, ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్8.30 శాతానికి తగ్గింది.