'25%తో ఒకే కార్పోరేట్ ట్యాక్స్ చాలు, భారత్ మార్చుకోవాలి'
న్యూఢిల్లీ: భారతదేశంలో ఒకే కార్పోరేట్ ట్యాక్స్ రేట్ 25 శాతం మాత్రమే అవసరమని, ఎలాంటి సర్ఛార్జీలు, సెస్లు లేకుండా దీనిని అమలు చేయవచ్చునని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ సంస్థ KPMG వెల్లడించింది. భారత ప్రభుత్వం సాధారణ పన్ను విధానానికి మొగ్గు చూపాలని అభిప్రాయపడింది. 'India: Redefining its growth path' పేరిట ఈ సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. ఇందులో పలు అంశాలను పేర్కొంది.
కార్పోరేట్ పన్నుపై గుడ్న్యూస్, మిడిల్ క్లాస్కు ఆదాయపన్నుపై ఊరట
MAT రద్దు, DDT విత్ హోల్డ్తో భర్తీ
మినిమమ్ ఆల్టర్నేటివ్ టాక్స్ను (MAT) రద్దు చేయాలని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(DDT)ను విత్ హోల్డ్ ట్యాక్స్తో భర్తీ చేయాలని KPMG నివేదికలో పేర్కొంది. గ్లోబల్ ట్రెండ్స్ను అనుసరించి కార్పోరేట్ ట్యాక్స్ను తగ్గించాలని ఇందుకు భారత్ సరళమైన ట్యాక్స్ రేట్ స్ట్రక్చర్ దిశగా అడుగులు వేయాలని, సింగిల్ కార్పోరేట్ ట్యాక్స్ రేటును 25 శాతంగా ఉంచాలని పేర్కొంది.
పన్ను విధానం మారాలి...
సర్ఛార్జీలు, సెస్లు ఉండకూడదని KPMG సూచించింది. పన్ను విధానాన్ని భారత్ మార్చుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. జీఎస్టీని సరళతరం చేసి సరికొత్త ప్రత్యక్ష పన్ను పద్ధతులను తీసుకు రావాలని పేర్కొంది. సరళమైన పన్ను విధానాలు భారత వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుస్తాయని, పోటీతత్వాన్ని పెంచుతాయని తెలిపింది.
విదేశీ కంపెనీలపై కూడా పన్ను తగ్గించాలి
విదేశీ కంపెనీలపై ప్రస్తుతం భారత్ పన్ను రేటును 40 శాతంగా (సర్ఛార్జ్, సెస్ కలిపి) విధిస్తోందని, దానిని తగ్గించాలని KPMG నివేదిక పేర్కొంది.
అన్ని కార్పోరేట్స్కు తక్కువ పన్ను రేటు అంతర్జాతీయంగా భారత వ్యాపార రంగం పోటీ పడేందుకు ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు KPMG (ఇండియా) హెడ్ ఆఫ్ ట్యాక్స్ హితేష్ గజారియా.
కంపెనీలకు బడ్జెట్లో ఊరట
కాగా, 2019-20 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 25 శాతం కార్పోరేట్ ట్యాక్స్ రేట్ పరిమితిని రూ.250 కోట్ల టర్నోవర్ నుంచి రూ.400 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. అప్పటి వరకు 30 శాతం ఉన్న ట్యాక్స్ పరిధి నుంచి రూ.400 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు ఊరట కలిగింది.