ఆటో సెక్టార్కు రిలీఫ్: కొత్త కార్లు కొనుగోలు చేయనున్న ప్రభుత్వం, మరిన్ని....
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఆందోళనలు నెలకొన్నాయి. భారత్లోను ఆ భయాలు కనిపిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంలో తీవ్ర మాంద్యం నెలకొని ఉంది. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆటో డీలర్లు మూతబడుతున్నాయి. కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆటో రంగానికి ఊరట కల్పించే న్యూస్ చెప్పారు.
నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ హైలైట్స్
ప్రభుత్వరంగ సంస్థలకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వరంగ సంస్థలు కొత్త వాహనాల కొనుగోలు చేయడాన్ని నిషేధించారు. దీనిని ఇప్పుడు ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కూడా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆటోరంగానికి డిమాండ్ తగ్గడంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం భారీఊరట కల్పించింది.
రిజిస్ట్రేషన్ పూర్తయ్యే కాలం వరకు అనుమతి
మార్చి 2020కి ముందు కొనుగోలు చేసిన భారత్ స్టేజ్ IV (BS IV) వాహనాలు వారి రిజిస్ట్రేషన్ పూర్తయ్యే కాలం వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. 2020 తర్వాత BS IV వాహనాలు నడపడం చట్ట విరుద్ధమనే ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని చెప్పారు. BS VI వెహికిల్స్ ఆపరేషన్ మార్చి 2020 నుంచి తీసుకు వస్తామన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు ప్రతిపాదన నిలిపేస్తున్నాం
ఆటో రంగంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ మరో ప్రకటన కూడా చేశారు. ఆటోరంగానికి కొత్త ఉత్తేజం తెచ్చేందుకు వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజును పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు అనుమతివ్వడం, బీఎస్ IV వాహనాలను వాటి కాల పరిమితి వరకు అనుమతిస్తామని చెప్పడం, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ఆటో రంగానికి కొత్త ఊపును ఇవ్వవచ్చు.