కార్పోరేట్ పన్నుపై గుడ్న్యూస్, మిడిల్ క్లాస్కు ఆదాయపన్నుపై ఊరట
న్యూఢిల్లీ: కార్పోరేట్ పన్నుపై కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనివ్వనుంది. కార్పోరేట్ పన్ను రేటును అన్ని కంపెనీలకు 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని, పన్ను చెల్లింపులపై సర్ఛార్జీని రద్దు చేయాలని ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్యానెల్ సూచించింది. పన్ను రేటును ఈ ఏడాది 30 శాతం వరకు తగ్గించినప్పటికీ ప్రపంచంలో అత్యధిక కార్పోరేట్ కలిగిన దేశంగా భారత్ ఉండనుంది.
నష్టాల్లో ఉన్న సంస్థలేవో ఇలా తెలుసుకోండి
కార్పోరేట్ పన్ను 25 శాతం తగ్గించాలి
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సభ్యుడు అఖిలేష్ రంజన్ నేతృత్వంలోని ప్యానల్ సోమవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు తన నివేదికను అందించింది. దీనిని బహిరంగపరచలేదు. ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా దీనిపై మాట్లాడేందుకు నిరాకరించింది. అయితే ఆదాయ పన్ను చట్టాన్ని సరిదిద్దాలని సిఫార్సులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కార్పోరేట్ పన్నును 25 శాతం తగ్గించాలని, అలాగే, ఆదాయంపై సర్ఛార్జ్కు ప్రభుత్వం దూరంగా ఉండాలని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
దశలవారీగా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు
గత బడ్జెట్లో రూ.400 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన కంపెనీలపై పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రూ.400 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన కార్పోరేట్ సంస్థలపై విధిస్తున్న పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లు నిర్మల సోమవారం ప్రకటించారు. సంపద సృష్టికర్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇందులో భాగంగా దశలవారీగా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తామన్నారు. మరోవైపు, భారతదేశ మధ్య తరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా వ్యక్తిగత ఆదాయపన్నులను కూడా గణనీయంగా తగ్గించాలని కూడా ప్యానల్ సూచన చేసింది.
ఎన్బీఎఫ్సీలకు ఊరట
మరోవైపు, NBFCలకు మూలధన సమీకరణ వ్యయాలను తగ్గించడానికి వీలు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. NBFCలు డిబెంచర్లను జారీ చేసే సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన డిబెంచర్ రెడెమ్షన్ రిజర్వ్(DRR) నిబంధనను తొలగించింది. కంపెనీల చట్టం కింద నిధులు సమీకరించే కంపెనీలు DRRను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ కంపెనీలు ఎగవేతకు పాల్పడితే ఇన్వెస్టర్లకు ఇబ్బందిలేకుండా చేయడమే దీని ఉద్దేశ్యం. ఇపుడు గతంలోలాగా లిస్టెడ్ కంపెనీలు తాము జారీ చేసే డిబెంచర్ల విలువలో 25% అఈఈ రూపంలో ఉంచాల్సిన అవసరం లేదు.
నివేదిక
ఆరు దశాబ్దాల క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టంను మార్చి కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఆదాయ పన్ను చట్టానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన నూతన ప్రత్యక్ష పన్నుల కోడ్ రూపొందించడానికి అఖిలేష్ రంజన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సోమవారం తన పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు సమర్పించారు. ప్రస్తుతం డొమెస్టిక్ కంపెనీలపై ప్రభుత్వం 30 శాతం పన్ను విధిస్తోంది, విదేశీ కంపెనీలపై 40 శాతం విధిస్తోంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన 4 శాతం సర్చార్జ్ విధిస్తోంది. అలాగే డొమెస్టిక్ కంపెనీలపై 12 శాతం సర్ఛార్జ్, ఫారన్ కంపెనీలపై 5 శాతం సర్ఛార్జ్ విధిస్తోంది.