గతంలో కంటే తగ్గిన హెరిటేజ్ ఫుడ్స్ లాభం, కారణమిదే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ - జూన్ (క్వార్టర్ 1) ఫలితాలను ప్రకటించింది. Q1లో ఏకీకృత నికర లాభం గత ఏడాది కంటే 15 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.21.3 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది రూ.18.1 కోట్లను ప్రకటించింది.
ఆ భారం వినియోగదారులపై వేయలేదు అందుకే తగ్గిన లాభం
వేసవి కారణంగా తొలి త్రైమాసికంలో పాల సేకరణ వ్యయం (ముడి పదార్థాల వ్యయం, ఇతర ఖర్చులు) అధికంగా ఉంటుందని, ఆ వ్యయాన్ని వినియోగదారులకు బదలీ చేయలేదని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. గత ఏడాది కంటే లాభం తగ్గడానికి ప్రధాన కారణం ఇదేనని తెలిపారు. లాభం కాస్త తగ్గినప్పటికీ సమీక్ష త్రైమాసికానికి కార్యకలాపాలద్వారా లభించిన ఆదాయం రూ.721.24 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.
లాభాలు పెంచుకుంటున్నాం
గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.641.60 కోట్లుగా ఉంది. దీంతో పోల్చితే ప్రస్తుత తొలి త్రైమాసికంలో ఆదాయం శాతం పెరిగిందని, కానీ నికర లాభంలో స్వల్పంగా క్షీణత ఉందని చెప్పారు. కొన్ని ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. అందుకు అనుగుణంగా లాభాలు పెంచుకుంటామన్నారు.
పెరిగిన హెరిటేజ్ ఉత్పత్తుల అమ్మకాలు
2019 జూన్ క్వార్టర్ ముగిసేనాటికి హెరిటేజ్ ఉత్పత్తుల అమ్మకాలు 12.41 శాతం పెరిగిందని తెలిపారు. ఏబీటా కూడా రూ.47.8 కోట్ల నుంచి రూ.48.7 కోట్లకు చేరుకుందన్నారు. ఈపీఎస్ రూ.2018 జూన్ క్వార్టర్లో రూ.4.48గా ఉండగా, ఇప్పుడు రూ.4.31గా ఉంది. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లతో పాటు కొత్త మార్కెట్లలో బ్రాండ్ మరింతగా పాతుకుపోవడానికి తాము చేస్తున్న కృషి ఫలిస్తోందన్నారు.