MSMEలకు జగన్ ఊతం, రూ.4,000 కోట్ల రుణాలు రీస్ట్రక్చర్: పెట్టుబడులకు కొత్త యాక్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో MSMEలకు అండగా వైసీపీ ప్రభుత్వం కొత్త స్కీంను ప్రారంభించనుంది. ఏపీలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం వైయస్సార్ నవోదయం పేరిట కొత్త పథకం తెచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న MSMEలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నారు.
SBI E-Rail: రైల్వే టిక్కెట్ను ఇలా ఈజీగా బుక్ చేసుకోండి
రూ.4వేల కోట్ల వన్ టైమ్ రీస్ట్రక్చర్
ప్రభుత్వం జిల్లాలవారీగా మొత్తం 86వేల MSMEల ఖాతాలను గుర్తించింది. రూ.4 వేల కోట్ల రుణాలను వన్ టైమ్ రీస్ట్రక్చర్ చేస్తారు. NPAలుగా మారకుండా, అకౌంట్స్ ఫ్రీజ్ కాకుండా చర్యలు తీసుకోనున్నారు. దీంతో MSMEలకు మరింత రుణంతో పాటు తక్షణ పెట్టుబడి అందే అవకాశం ఏర్పడుతుంది. అవకాశాన్ని వినియోగించుకునేందుకు MSMEలకు తొమ్మిది నెలల వ్యవధి ఇస్తారు.
ఉచిత కరెంట్
ఏపీ కేబినెట్ భేటీలో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 200 యూనిట్ల వరకు ఎస్సీలకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయాలని నిర్ణయించారు. దీంతో పదిహేను లక్షలమంది ఎస్సీ కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం రూ.411 కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
పెట్టుబడుల కోసం కొత్త యాక్ట్
ఏపీఈడీబీ 2018 చట్టాన్ని రద్దు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దానికి బదులు ఏపీ పెట్టుబడుల ప్రమోషన్, అండ్ మానిటరింగ్ యాక్టు (APIPM)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, ప్రాజెక్టుల అనుమతి, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తారు.