కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు దూరం దూరం....
నిరర్ధక ఆస్తులు (ఎన్ పీ ఏ) అన్న మాట వినపడగానే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉలిక్కి పడే పరిస్థితులు కొంతకాలంగా కొనసాగుతున్నాయి. కార్పొరేట్ కంపనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించక పోవడంతో ఆ రుణాలు నిరర్ధక ఆస్తులు లేదా మొండి పద్దులుగా మారిపోయాయి. కంపెనీల నుంచి ఈ సొమ్మును వసూలు చేసుకోవడానికి బ్యాంకులు నానా కష్టాలు పడుతున్నాయి. కొన్ని కంపెనీలపై దివాలా పిటిషన్ వేసి ఎంతో కొంత రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇష్టారాజ్యంగా కార్పొరేట్లకు రుణాలు ఇచ్చి ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక బ్యాంకులు అటు భారత రిజర్వు బ్యాంకు నుంచి ఇటు ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ కంపెనీలకు అప్పులు ఇవ్వాలంటేనే జంకుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి పద్దులు దాదాపు రూ. 8.5 లక్షల కోట్ల వరకు ఉన్నాయి.
ఇక భూమి,షేర్లు, గోల్డ్ కొన్న వెంటనే ఐటీ శాఖ నుంచి SMS
లీడ్ బ్యాంకింగ్ సంబంధాలకు స్వస్తి
ఎన్ పీ ఏ దెబ్బతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్ బ్యాంకులకు లీడ్ బ్యాంకుగా వ్యవహారించడంలోనూ వెనకడుగు వేస్తున్నాయి. అయితే ఈ అవకాశాన్ని ప్రయివేట్ రంగంలోని బ్యాంకులు వదులుకోవడం లేదు. ఇటీవలి అధ్యయనం ప్రకారం 2016 సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు లీడ్ కార్పొరేట్ బ్యాంకు పరంగా 20 శాతం వాటాను కలిగి ఉండేవి. 2018 సంవత్సరంలో ఇది 15 శాతానికి తగ్గి పోయింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు వెనకడుగు వేయడంతో ప్రయివేట్ రంగ బ్యాంకులు రంగ ప్రవేశం చేస్తున్నాయి.
కాగా 75 శాతం కార్పొరేట్ కంపెనీలు తమ కార్పొరేట్ బ్యాంకింగ్ సర్వీసుల కోసం ఎక్కువగా హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ను వినియోగించు కుంటున్నాయి. మూడో స్థానంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉంది. విదేశీ బ్యాంకుల్లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంకులను కార్పొరేట్ బ్యాంకులు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. లీడ్ కార్పొరేట్ బ్యాంకింగ్ సంబంధా ల్లో ఎస్ బీ ఐ తన మార్కెట్ వాటాను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచుకుంది.
రిటైల్ రుణాలపై బ్యాంకుల కన్ను
* కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులు రిటైల్ రుణాలపై దృష్టిసారిస్తున్నాయి.
* ఇందులో వాహన రుణాలు, గృహ రుణాలు, విద్య రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటివి ఉంటాయి.
* కార్పొరేట్ రుణాలపై వచ్చే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. రిటైల్ రుణాలపై వడ్డీ రేటు ఎక్కువ.
* రిటైల్ రుణాల్లో మొండి పద్దులు తక్కువగా ఉంటాయి. రిస్క్ తక్కువ కాబట్టి బ్యాంకులు ఈ విభాగంపై దృష్టి పెడుతున్నాయి.
జోరుగా రికవరీ
* ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
* ఇందులో భాగంగా గత నాలుగు ఆర్ధిక సంవత్సరాల్లో రూ. 3,59,496 కోట్ల మొండిపద్దులను రికవరీ చేసాయి.
* 2018-19 సంవత్సరంలో రికవరీ మొత్తం రూ. 1,23,156 కోట్లుగా ఉంది.