ఒక్కరోజులోనే రూ.1.76 కోట్లు పెరిగిన సంపద, కారణాలివే
ముంబై: బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులో (సోమవారం, 3, జూన్) రూ.1.76 లక్షల కోట్లు పెరిగి రూ.156.14 లక్షల కోట్లకు చేరుకుంది. కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో ఓ దశలో సెన్సెక్స్ 40,308.90 పాయింట్లు, నిఫ్టీ 12,103.05 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిల్ని తాకింది. సోమవారం మార్కెట్ దూకుడుకు పలు అంశాలు దోహదపడ్డాయి. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు తగ్గిస్తుందనే ఆశలు కూడా ఉన్నాయి. సెన్సెక్స్ 553 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్ల లాభంతో సోమవారం నాడు క్లోజ్ అయింది. లాభాలతో మార్కెట్లు మురిసిపోయాయి.
ఈ క్రెడిట్-డెబిట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నారా, తెలుసుకోండి...
రూ.1.76 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
సోమవారం స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లడంతో ఇన్వెస్టర్ల సంపద కూడా అంతేస్థాయిలో ఎగబాకింది. ఈ కారణంగానే బీఎస్ఈలో లిస్టైన ఇన్వెస్టర్ల సంపద రూ.1.76 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎం-క్యాప్) రూ.1,76,402.37 కోట్లు పెరిగి రూ.1,56,14,416.92 కోట్లకు చేరుకుంది. రెపో రేటు తగ్గుతుందనే అంచనాతో ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ రంగ షేర్లు జోరు మీద కనిపించాయి. 30 షేర్ల ఇండెక్స్లో 27 షేర్లు లాభాల్లో ముగియగా, కేవలం మూడు మాత్రమే నష్టపోయాయి.
జూన్ సిరీస్ నిఫ్టీ ఫ్యూచర్ రోల్ ఓవర్స్ 72 శాతంగా ఉన్నాయి. ఈ రోలోవర్స్ మూడు నెలల సగటు 69 శాతం మాత్రమే. మూడు నెలల సగటు కన్నా అధికంగా ఉండటం మార్కెట్ షార్ట్ టర్మ్ ట్రెండింగ్ పీరియడ్లోకి ప్రవేశించడాన్ని సూచిస్తోందని చెబుతున్నారు.
దూసుకెళ్లిన మార్కెట్కు కారణాలివే..
వృద్ధిరేటు అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం, కీలక రంగాలు పడకేసినప్పటికీ ఇన్వెస్టర్లు వీటిని పట్టించుకున్నట్లుగా లేదు. గురువారం ఆర్బీఐ ప్రకటించనున్న సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు మెండుగా ఉండటంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసారు. సోమవారం మొదటి నుంచే లాభాలల్లో ఉన్న మార్కెట్లు ఏ దశలోను వెనక్కి తిరిగి చూడలేదు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో సంస్కరణలు కొనసాగించే అవకాశాలు ఉండటం కూడా మార్కెట్లకు లాభాలు తెచ్చింది. ఇంట్రాడేలో రికార్డ్ స్థాయి తాకిన మార్కెట్లు చివరకు చారిత్రక గరిష్ఠ స్థాయిలోనే ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్ సూచీ సోమవారం 553.42 పాయింట్స్ (1.39 శాతం) లాభంతో 40,267.62 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 165.75 పాయింట్లు (1.39 శాతం) ఎగబాకి మరోసారి 12 వేల మార్క్ను దాటి 12,088.55 వద్ద స్థిరపడింది.
ఆర్బీఐ రెపో రేటు
గత ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 4లో జీడీపీ అయిదేళ్ల కనిష్టానికి 5.8 శాతానికి చేరుకుందని కేంద్ర గణాంకాల సంస్థ (CSO) శుక్రవారం తెలిపింది. మార్చి క్వార్టర్లో జీడీపీ తగ్గడంతో ఈ వారంలో జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీలో కీలక వట్టీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు మార్కెట్లకు కొత్త ఊపును ఇచ్చాయి. జీడీపీ తగ్గడంతో వినియోగం జోరును పెంచే సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తెస్తుందనే ఆశలు పెరిగాయి. దీంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆర్బీఐ గురువారం ద్రవ్య విదాన సమీక్షలో రెపో రేటును మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాయితీలు ఇచ్చే అవకాశం లేనందున వృద్ధి రేటును గాడిలో పెట్టేందుకు రెపో రేటు తగ్గింపు చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.
పుంజుకున్న రూపాయి పెరిగిన విదేశీ పెట్టుబడులు
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 44 పైసలు బలపడి 69.26 వద్ద ముగిసింది. ఇది కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. రూపాయి మారకం రేటు పెరగడం, ఎఫ్పీఐలకు కలిసి వచ్చే అంశం. దీంతో ఎఫ్పీఐలు మరింత జోరుగా భారత మార్కెట్లో కొనుగోళ్లు చేస్తారని భావిస్తున్నారు. గత మూడు వారాల వరకు నికర అమ్మకందార్లుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. మొత్తం మే నెలలో రూ.9,031 కోట్ల నికర పెట్టుబడులు పెట్టిన సోమవారం ఒక్కరోజే రూ.3వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. కార్పోరేట్ రంగం నిధుల కొరత ఎదుర్కొంటున్నప్పటికీ మార్కెట్లో మాత్రం పెట్టుబడులకు ఢోకా లేదు. గత ఏడాది ముఖం చాటేసిన ఎఫ్పీవోలు ఇప్పుడు జోరుగా కొనుగోళ్లు చేస్తుండటంతో ద్రవ్య లభ్యత పెరిగింది.
రైతులకు కేంద్రం సాయం, తగ్గిన ముడి చమురు ధర
గత శుక్రవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో రైతులు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కూడా మార్కెట్కు కలిసి వచ్చాయని అంటున్నారు. పీఎం కిసాన్ నిధి కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు పెట్టుబడి సాయం కేంద్రం అందించనుంది. మరోవైపు ముడి చమురు ధరలు ఏప్రిల్ 30వ తేదీ నుంచి 15 శాతం మేర పతనమయ్యాయి. గత శుక్రవార ఒక్కరోజే 2 శాతం క్షీణించాయి. సోమవారం ఒక శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఆరు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. త్వరలో ఇది మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.