చిరు వ్యాపారులకు మోడీ కానుక: ఉచిత GST-బిల్లింగ్ సాఫ్ట్వేర్
హైదరాబాద్: అఖండ మెజార్టీతో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చిరు వ్యాపారులకు తొలి కానుక అందజేయనుంది. రూ.1.5 కోట్లు (కోటిన్నర) కంటే తక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులందరికీ ఉచితంగా జీఎస్టీ-బిల్లింగ్ సాఫ్టువేర్ను అందించనుంది.
భారత్కు అమెరికా గుడ్ న్యూస్: ఆ లిస్ట్ నుంచి తొలగింపు
మోడీ ప్రభుత్వం ఉపశమనం
గత ప్రభుత్వంలో హడావుడిగా జీఎస్టీని అమలు చేసి అటు వ్యాపారులను, ఇటు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసిన ఎన్డీయే ప్రభుత్వం, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేసినా ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టడంతో.. ఈ అంశాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరికీ ఉపశమనం కల్పించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
మోడీ నిర్ణయం
అందుకే ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు మోడీ ఉచిత సాఫ్టువేర్ అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా అకౌటింగ్, బిల్లింగ్ సాఫ్టువేర్లు కొనుగోలు చేయాలంటే సుమారు రూ.20,000 నుంచి రూ.30,000 ఖర్చవుతుంది. ఇంకొన్ని కంపెనీలు నెలకు రూ.2,500 అద్దెతో సాప్టువేర్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇక నుంచి చిరు వ్యాపారులకు ప్రభుత్వం అందించే ఉచిత సాఫ్టువేర్ వల్ల వారు భారీగా లబ్ధి పొందనున్నారు.
8 రకాల జీఎస్టీ సాఫ్టువేర్స్
జీఎస్టీ పోర్టల్లోకి లాగిన్ అయి సంస్థ టర్నోవర్ రూ.1.5 కోట్ల కంటే తక్కువ ఉన్నట్లు డిక్లరేషన్ ఇస్తే 8 రకాల జీఎస్టీ సాఫ్టువేర్లు కనిపిస్తాయి. అందులో నుంచి ఆయా సంస్థలకు అనుకూలమైన దానిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్టువేర్ క్లౌడ్ ఆధారితంగా పని చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని లక్షలాది మంది వ్యాపారులకు లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయం మోడీ ప్రభుత్వంపై ఆదిలోనే సానుకూల దృక్పథం ఏర్పడేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.