మోడీ రాకతో కార్పొరేట్లు ఖుషీ.. ఖుషీ.. ఎందుకంటే..
మోడీ విజయ దుంధుబి స్టాక్ మార్కెట్లతో పాటు బాండ్ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలం నుంచి వడ్డీ రేట్ల విషయంలో కాస్త అనిశ్చితితో ఉన్న కార్పొరేట్లు ఇప్పుడు వేగం పెంచారు. ఎందుకంటే బాండ్స్ పై వడ్డీ రేట్లు మెల్లిగా తగ్గుముఖం పడ్తున్నాయి. అది కార్పొరేట్లకు నిజంగా చాలా కలిసొచ్చే అంశం.
తాజాగా నైవేలీ లిగ్నైట్ అనే ప్రభుత్వ సంస్థ రూ. 1475 కోట్ల విలువైన బాండ్లను ఇష్యూ చేసింది. 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఈ ట్రిపుల్ ఏ రేటింగ్ బాండ్ల వడ్డీ 8.31 శాతానికి దిగొచ్చింది. గత ఏడాది మే నుంచి చూస్తే.. ఇదే అత్యంత తక్కువ వడ్డీ. బిజినెస్ సెంటిమెంట్ మెరుగవడం, పటిష్టమైన ప్రభుత్వం, సంస్కరణలకు మరింత ఆస్కారం వంటివన్నీ కలిసొస్తున్నాయని, అందుకే బాండ్ ఈల్డ్స్ తగ్గాయనేది కార్పొరేట్ వర్గాల మాట.
మూడో రోజూ లాభాలు ! మిడ్, స్మాల్ క్యాప్స్ హుషారు
నిధుల సమీకరణ
దేశంలోని రెండో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ జెఎస్డబ్ల్యు స్టీల్ కూడా బాండ్స్ ద్వారా రూ.7000 కోట్లు సమీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే బాటలో దేశ నెంబర్ ఒన్ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ కూడా రూ.5000 కోట్లను నోట్స్ ద్వారా సమీకరించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీళ్లతో పాటు కుమార మంగళం బిర్లాకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థలు కూడా సుమారు రూ.7500 కోట్లను బాండ్ల జారీ ద్వారా నిధుల కోసం చూస్తున్నారు. వీటికి ఐదేళ్ల కాలపరిమితి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎందుకంటే ఇంతకాలం వడ్డీ రేట్లు అధికంగా ఉండడం వల్ల బాండ్ల ద్వారా రుణాలు సమీకరించడం కార్పొరేట్లకు చాలా కష్టంగా మారింది. ఎందుకంటే అధిక వడ్డీతో రుణాలు తీసుకుంటే వాటిని తీర్చేందుకు తడిసి మోపెడవుతుంది. బయటి మార్కెట్లో 10 శాతం వడ్డీతో రుణాలు తీసుకుంటే.. అసలు, వడ్డీతో కలిపి వీటి చెల్లింపు చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఇంతకాలం బాండ్ మార్కెట్ యాక్టివిటీ పెద్దగా లేదు.
ఎందుకంత నమ్మకం
నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా రెండో సారి అధికార పగ్గాలు చేపట్టడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఏ పార్టీ మద్దతూ లేకుండా బీజేపీనే స్వతంత్రంగా అధికారాన్ని చేపట్టడం మరింత పాజిటివ్ సెంటిమెంట్ను తీసుకొచ్చింది.దీంతో ఇక్కడి నుంచి విదేశాల ద్వారా మన కార్పొరేట్లకు అధిక నిధులు వచ్చిపడ్తాయనే కాన్ఫిడెన్స్ పెరిగింది. మన దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరిగి, రూపాయి స్థిరంగా ఉండి, జీడీపీ లక్ష్యాలు కొనసాగితే.. విదేశీ ఫండ్స్ వచ్చిపడ్తాయి. ఇది కార్పొరేట్లకు చాలా కలిసొస్తుంది. ఎందుకంటే తక్కువ వడ్డీతో రుణాలు తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
దివాన్ దెబ్బ
ఆరేడు నెలల నుంచి బాండ్ మార్కెట్కు దెబ్బపై దెబ్బ పడ్తోంది. మొదట ఐఎల్ఎఫ్ఎస్ పతనం మార్కెట్లను కుంగదీసింది. బాండ్స్ జారీ చేసేందుకే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు భయపడ్డాయి. ఈ మధ్య దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా అగ్నికి ఆజ్యం పోసింది. దీంతో బాండ్లు జారీ చేసేవారు, అధిక రేట్ పెట్టి వాటిని తీసుకునే నిలకడైన కార్పొరేట్ సంస్థలు కరువయ్యాయి. ఇప్పుడు మోడీ 2.0తో పరిస్థితి కాస్త కుదుటపడింది.