ప్రారంభంలో రికార్డులు.. చివర్లో నష్టాలు!
ప్రారంభంలో రికార్డులను క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్ సూచీలు ఆఖర్లో మాత్రం నిరుత్సాహపడ్డాయి. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను లాభాల నుంచి నష్టాల్లోకి తెచ్చింది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదుకావొచ్చనే స్కైమెట్ అంచనాలకు తోడు గురువారం వెలువడబోయే ఆర్బీఐ పరపతి విధాన ప్రకటనపై అనిశ్చితి మార్కెట్లకు కాస్త ఆందోళనలోకి నెట్టాయి. దీంతో ఇంట్రాడేలో 11760పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయిని అధిగమించిన మార్కెట్లు మళ్లీ ఏకంగా 100 పాయింట్లు కోల్పోయింది. ఇదే బాటలో సెన్సెక్స్ 400, బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్లు పీక్ నుంచి పడింది. చివరకు నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 11644 పాయింట్ల దగ్గర, సెన్సెక్స్ 180 పాయింట్ల నష్టంతో 38,877 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్ల లాస్తో 30,093 వద్ద క్లోజైంది.
ఆంధ్రప్రదేశ్లోని ఈ 6 పట్టణాల్లో జొమాటో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు
ఇండియాబుల్స్ హౌసింగ్, మారుతి సుజుకి, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ సి ఎల్ టెక్, జె ఎస్ డబ్ల్యు స్టీల్ టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. బిపిసిఎల్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్, ఎస్బీఐ షేర్లు టాప్ 5 లూజర్స్ జాబితాలో చేరాయి.
వర్షాలు ఈ సారి సరిగ్గా పడవా
ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెన్ అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువే నమోదు కావొచ్చు. లాంగ్ పీరియడ్ యావరేజ్ 93 శాతం మాత్రమే ఉండొచ్చని స్కైమెట్ అంచనా వేస్తోంది. ఎల్నినో అంశాన్ని కూడా తేలిగ్గా తీసుకోలేమని వెల్లడించింది. జూలైలో సాధారణం కంటే 55 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా కడ్తోంది. అదే సమయంలో ఈ సీజన్లో అధిక వర్షపాతాలు నమోదయ్యే అవకాశాలు దాదాపుగా లేవని తేల్చింది. ఇది ఒక రకంగా స్టాక్ మార్కెట్లకు నెగిటివ్ అంశం. అందుకే స్కైమెట్ అంచనాల తర్వాత మార్కెట్లు నిరుత్సాహపడ్డాయి.
రేపే ఆర్బీఐ పాలసీ
మంగళవారం ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ భేటీ రేపు మధ్యాహ్నం ముగుస్తుంది. వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందా లేదా అనే అంశంపై రేపు ఆర్బీఐ గవర్నర్ ప్రకటన చేస్తారు. దీని గురించి కూడా మార్కెట్లు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఒక వేళ నిర్ణయంలో ఏ మాత్రం మార్పు ఉన్నా మార్కెట్లు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాయి.
చమురు వదుల్తోంది
అంతర్జాతీయ మార్కెట్ల క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లలో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువవుతోంది. ఈ రోజు కూడా హెచ్ పి సిఎల్, బీపీసీఎల్ 4 శాతానికిపైగా పడ్డాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3 శాతం క్షీణించింది.
ప్రభుత్వ బ్యాంకుల్లో అమ్మకం
గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పీఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో లాభాల స్వీకరణ మొదలైంది. ఈ రోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.5 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.8 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.7 శాతం, ఓరియంటల్ బ్యాంక్ - కెనెరా బ్యాంక్ 3.5 శాతం వరకూ నీరసించాయి.
అమరరాజా - జాన్సన్ కటీఫ్
1997 నుంచి జాన్సన్ కంట్రోల్ హిటాచీతో ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుంది అమరరాజా. 22 ఏళ్ల టెక్నికల్ అసిస్టెన్స్ బంధానికి తెరపడింది. ఈ మధ్యకాలంలో జాన్సన్ సంస్థ టెక్నాలజీలన్నింటినీ తాము నేర్చుకున్నామని, తాజా తెగదెంపుల ప్రభావం పెద్దగా ఉండబోదని అమరరాజా వెల్లడించింది. అయినా మార్కెట్లో ఈ స్టాక్ 10 శాతం వరకూ పతనమైంది. ఇంట్రాడేలో రూ.650 వరకూ పడిన స్టాక్ చివరకు 6.75 శాతం లాస్తో రూ.672.35 దగ్గర క్లోజైంది.