రిలయన్స్ విలువ త్వరలో రూ.1,00,000,00,00,00,000 కోట్లు
రిలయన్స్ విలువ త్వరలో రూ.10 లక్షల కోట్లకు చేరబోతోంది. దేశంలోని అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా అవతరించబోతోంది. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ విలువ రూ.8.7 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ నానాటికీ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఇదే ఊపు కొనసాగితే అతి త్వరలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సంస్థగా అవతరిస్తుంది. దీనికి ఎంతో కాలం పట్టదని మార్కెట్ నిపుణులు చెబ్తున్నారు. ఆయిల్, టెక్స్టైల్, టెలిఫోన్, రిటైల్ సహా వివిధ రంగాల్లో పాగా వేసిన రిలయన్స్ సుమారు 127 బిలియన్ డాలర్ సంస్థగా ఎదిగింది.
ఎరిక్సన్కు బకాయి చెల్లింపు ఎఫెక్ట్, అనిల్ అంబానీ కంపెనీ షేర్ల జోరు
మైలురాయిని అధిగమించే అవకాశాలు ప్రస్తుతం కష్టమే
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో రిలయన్స్ స్టాక్ రూ.1390 దగ్గర ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.1388 వరకూ వెళ్లింది. తాజాగా ప్రైసింగ్తో చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.9 లక్షల కోట్లకు దగ్గరవుతోంది. ఈ స్థాయిలో మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థ ఏదీ మన దగ్గర లేదు. తర్వాతి స్థానంలో టీసీఎస్ (రూ.7.6 లక్షల కోట్లతో)రెండో స్థానంలో, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ (రూ.6.2 లక్షల కోట్లు) ఉంది. మిగిలిన సంస్థలు ఈ మైలు రాయిని అధిగమించే అవకాశాలు ప్రస్తుతం కష్టమే.
జియో కలిసొచ్చింది
2008 నుంచి తొమ్మిదేళ్ల పాటు ఇన్వెస్టర్ల సహనాన్ని దారుణంగా పరీక్షించిన రిలయన్స్ స్టాక్ రెండేళ్లలో భారీ లాభాలను అందించింది. గతేడాది వాళ్లు ఇచ్చిన బోనస్తో పాటు రిటర్న్స్ కూడా అనూహ్యంగా వచ్చాయి. 2018లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 24 శాతం లాభాలను అందించింది. ఈ ఏడాది ఇప్పటికే 22 శాతం రిటర్న్స్ ఇచ్చింది. జియో వచ్చిన తర్వాత ఇన్వెస్టర్ల ఫోకస్ ఈ స్టాక్పై మరింత పెరిగింది. రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో జియోను ప్రారంభించిన ముకేష్ అంబానీకి ఈ రంగంపై అమితమైన కాన్ఫిడెన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ఆయిల్ అండే డేటా గోల్డ్గా మారబోతోందని ముకేష్అంబానీ పదే పదే అనేక వేదికలపై వెల్లడించారు.
లాభాలే లాభాలు
రిటైల్, టెలికాం రంగాల్లో కొత్త ప్రయత్నాలు, ఆయిల్ - పెట్రోకెమికల్, రిఫైనరీ విభాగాల్లో స్థిరమైన ఆదాయం రిలయన్స్ ఇండస్ట్రీస్కు కలిసొస్తోంది. డిసెంబర్ 2019తో ముగిసిన త్రైమాసికానికి ఈ సంస్థ రూ.22628 కోట్ల ఎబిటాను సాధించింది. దీనిపై రూ.10251 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇక్కడ కూడా ఓ విశేషం ఏంటంటే.. ఒక క్వార్టర్లో పదివేల కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థగా కూడా రిలయన్స్ ఖ్యాతికెక్కింది.
ఇదే సమయంలో జియో రూ.12252 కోట్ల ఆదాయంపై రూ.831కోట్ల నికర లాభాన్ని సంస్థ నమోదు చేసింది. ఇది మరింతగా పెరగొచ్చని రిలయన్స్ గట్టి నమ్మకంతో ఉంది.