ఈరోజు నుంచి జరగబోయే ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ షాపింగ్ కి ఆధార్ నెంబర్ ఇస్తున్నారా?
తమ వార్షిక ఫ్లాగ్ షిప్ సేల్ ప్రారంభానికి ముందు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆధార్ వివరాలతో అరువుకి సామాన్లు అమ్ముతామని ప్రకటించాయి. కంపెనీల ఈ ప్రకటనపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు వినియోగదారుల ఆధార్ వివరాలు అడగరాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. కంపెనీలు ఆధార్ వివరాలు తీసుకోవడం కోర్ట్ తీర్పుని ఉల్లంఘించడమే అంటున్నారు న్యాయ నిపుణులు.
అక్టోబర్ 10-15 వరకు అమెజాన్ 'ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్', అక్టోబర్ 10-14 వరకు ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్' జరగనున్నాయి. రెండు కంపెనీలు అమ్మకాలు పెంచుకొనేందుకు క్రెడిట్/డెబిట్ కార్డులు లేకుండా ఇన్ స్టెంట్ లోన్ ఆఫర్ ప్రకటించాయి. చౌకగా బ్రాండెడ్ వస్తువులు దొరుకుతుండటంతో చాలా మంది సామాగ్రిని ఎంపిక చేసి కార్ట్ లో అయితే వేస్తారు కానీ బడ్జెట్ పెరిగిపోవడంతో కొనకుండా వదిలేస్తారు. అలాంటి కస్టమర్లకు అప్పు ఇచ్చి కొనిపించి అమ్మకాలు పెంచుకొనేందుకు రెండు ఈ కామర్స్ సంస్థలు ఈ కొత్త ఎత్తుగడ వేశాయి. మొబైల్ యాప్ లో రూ.60,000 వరకు రుణం ఇస్తామని ఊరిస్తున్నాయి. అది కూడా వడ్డీ లేకుండా. ఈ ఆఫర్ వినియోగించుకొనేందుకు కస్టమర్లు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇస్తే ఎంత మొత్తం రుణం వినియోగించవచ్చో తెలుస్తుంది. కంపెనీలు ఆ కస్టమర్ మునుపటి కొనుగోళ్లు, తిరిగి చెల్లించిన చరిత్ర ఆధారంగా రుణం అందజేస్తాయి.
ఈకామర్స్ కంపెనీలు ఆధార్ నెంబర్ అడగడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సుప్రీంకోర్ట్ తీర్పుని ఉల్లంఘించడమేనని అంటున్నారు న్యాయ నిపుణులు. ప్రైవేట్ కంపెనీలు వినియోగదారుల వివరాలు కోరరాదని కోర్టు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆధార్ అడగడం ముమ్మాటికీ తప్పేనంటున్నారు మూలం ఎన్ టీవీ.