మూడు బ్యాంకులు విలీనం సరే .. మరి మొండి బాకీలు పరిస్థితి.
బ్యాంకింగ్ రంగంలో మరో విలీనానికి కేంద్ర ప్రభుత్వం తెర తీసింది. దేశంలో రుణ వితరణ, ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), విజయా బ్యాంక్, దేనా బ్యాంక్లను విలీనం చేస్తామని ప్రకటించింది. తద్వారా ఏర్పడే సంస్థ దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్గా అవతరించనున్నది. కానీ ఆ మూడు బ్యాంకుల నుంచి వివిధ సంస్థలు తీసుకున్న రూ.80 వేల కోట్ల మొండి బాకీలు, వాటిల్లో పని చేస్తున్న సిబ్బంది భవితవ్యం మాటేమిటని బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం ప్రశ్నిస్తోంది.
అతిపెద్ద
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ గత ఏడాది ఏప్రిల్లో 5 అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ)ను విలీనం చేసుకున్నది. ప్రస్తుతం దేశంలో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. బీఓబీ, దేనా, విజయా బ్యాంక్ల విలీనం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 19కి తగ్గనుంది.
మూడు బ్యాంకులు
విలీనం తర్వాత ఏర్పడే బ్యాంక్కు కూడా ప్రభుత్వం మూలధన మద్దతు ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా విలీనం పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంటోంది. అప్పటివరకు ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
అరుణ్ జైట్లీ
విలీనంతో బ్యాంకులు మరింత పటిష్ఠం కావడంతోపాటు వాటి రుణ వితరణ సామర్థ్యం కూడా మెరుగవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకుల విలీనాలు కూడా ప్రభుత్వ ఎజెండాలో ఒకటని, అందులో భాగంగానే తాజా ప్రకటన చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రతిపాదన ఉద్దేశాలను ప్రస్తావించారు. బ్యాంకుల రుణ మంజూరు సామర్థ్యం బలహీనపడిందని, దాంతో కార్పొరేట్ రంగంలో పెట్టుబడులపై ప్రభావం పడుతోందన్నారు.
తాజా విలీనం
గతంలో ఎడాపెడా రుణాలు మంజూరు చేసిన ఫలితంగా మొండి బకాయిలు భారీగా పేరుకుపోయి చాలా వరకు ప్రభుత్వ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. తాజా విలీనం తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాలు పుంజుకోనున్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో విలీనాలను వేగవంతం చేసేందుకు గత ఏడాది ఆగస్టులో కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఉద్యోగి సర్వీసుపై
ఆ మూడు బ్యాంకుల విలీన ప్రతిపాదనను త్వరలోనే బ్యాంకుల బోర్డులకు పంపనున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. విలీనంతో బ్యాంకుల కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యంతోపాటు ఖాతాదారులకు సేవలు మరింత మెరుగపడతాయని పేర్కొన్నారు. విలీనం సందర్భంగా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఏ ఉద్యోగి సర్వీసుపై ప్రభావం పడనీయబోమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
ప్రభుత్వ బ్యాంకుల
ప్రస్తుతం ప్రభుత్వరంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఉంది. రెండో స్థానంలో ప్రైవేట్ రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మూడో స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. దేశ బ్యాంకింగ్ ఆస్తుల్లో ఈ బ్యాంకుల వాటాయే మూడింట రెండు వంతులు ఉంటుంది. ఇక మొండి పద్దుల్లో (ఎన్పిఎ) ప్రభుత్వ బ్యాంకుల వాటాయే అత్యధికంగా ఉంది.