రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ... ఇది ఎలా సాధ్యమైంది?
కొత్త ఏడాది కానుకగా సోమవారం నుంచి తెలంగాణ మొత్తం మీద రైతులకు 24 గంటల కరెంటు సరఫరా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి అపూర్వ కానుక అందించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కస
దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్థరాత్రి 12:01 గంటలకు 24 గంటల సరఫరా ప్రారంభించారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం ద్వారా ఏర్పడే డిమాండ్ ను కూడా ముందుగానే అంచనా వేసిన విద్యుత్ సంస్థలు అందుకు కావాల్సిన విద్యుత్ ను సమకూర్చుకోవడానికి కూడా వ్యూహం ఖరారు చేశారు. కొత్త ఏడాది కానుకగా సోమవారం నుంచి తెలంగాణ మొత్తం మీద రైతులకు 24 గంటల కరెంటు సరఫరా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి అపూర్వ కానుక అందించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కసరత్తు, అమలు బృహత్ కార్యక్రమం సంబంధించిన పలు వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
కసరత్తు ఇలా
ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రాన్స్ కో, డిస్క్మ్ల్లో వేల ఉద్యోగాలకు సంబంధించి ఆలోచించారు. వ్యవసాయానికి 24 కరెంటు ఇవ్వడం వల్ల పడే లోడ్ లు, ఎక్కువ లోడ్ లు వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జనవరి 1న ప్రారంభమయ్యే 24 గంటల కరెంటు వల్ల లోడ్ లు క్రమంగా పెరుగుతాయని, మార్చి వచ్చే నాటికి 11వేల మెగావాట్లకు పైగా డిమాండ్ వస్తుందని అంచనా వేశారు. దానికి తగినట్లు విద్యుత్ ను సమకూర్చడానికి ఏర్పాట్లు చేశామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు. పంపిణీ, సరఫరా వ్యవస్థలు సక్రమంగా నడిచేటట్లు చూడాలని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా తమకు తెలియచేయాలని, అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని చెప్పారు. వచ్చే జూన్ నుంచి ఎత్తిపోతల పథకాల పంప్ హౌజులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున లోడ్ మరింత ఎక్కువవుతుందని, అప్పుడు కూడా రైతాంగానికి 24 గంటల కరెంటు ఇవ్వాల్సి ఉన్నందున దానికోసం వ్యూహం తయారు చేసుకోవాలని చెప్పారు.
2. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్
వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నది. ఇప్పటి వరకు ఈ ఘనతను ఏ రాష్ట్రం కూడా సాధించలేదు. కొన్ని రాష్ర్ట్రాలు 9గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 24 గంటల సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ ఉచితంగా ఇవ్వడం లేదు. ఉచితంగా 24గంటల వ్యవసాయ కరెంటు ఇచ్చేరాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే కావడం గమనార్హం. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు ఇప్పుడిక 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుంది.
3.అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రైతులకు 9 గంటల కరెంటు
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే రైతులకు రోజుకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. రైతులు కొంత కుదురుకున్న తర్వాత, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి కాస్త మెరుగైన తర్వాత మరో మెట్టు ఎక్కాలని సీఎం కేసీఆర్ భావించారు. రైతులకు విడతల వారీగా కాకుండా 24 గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నించారు. అందుకనుగుణంగానే విద్యుత్ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. 2016 జూలై నుంచి పాత మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ అందించారు.
4. మొదట ప్రయోగాత్మకంగా-ఇప్పుడు ఆచరణలోకి
ఆ తర్వాత 2016 నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 23 లక్షల పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పంపుసెట్లకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా అందించిన తర్వాత విద్యుత్ సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. ఒకానొక దశలో రోజుకు 9,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయంతో పాటు ఇతర వర్గాలకు అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి విద్యుత్ డిమాండ్ అంచనాలు రూపొందించాయి. 11వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అంచనావేసి అందుకు తగ్గట్లు సరఫరా చేయడానికి ఏర్పాట్లు జరిగాయి.
5. నిరంతరాయ విద్యుత్ కోసం రూ.12,610 కోట్ల వ్యయం
రూ.12,610 కోట్ల వ్యయంతో 24 గంటల నిరంతరాయ విద్యుత్ అందించేందుకు జెన్ కో-ట్రాన్స్ కో, ట్రాన్స్ కో, ఎన్.పి.డి.సి.ఎల్., ఎస్.పి.డి.సి.ఎల్. సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. అటు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు, అదే సందర్భంలో గృహ, వాణిజ్య, పరిశ్రామిక అవసరాల కోసం కూడ 24 గంటల నాణ్యమైన కరెంటు అందివ్వడానికి ఉన్న సాంకేతిక అవకాశాలను, ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రిడ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ అదనపు ఏర్పాట్లు చేశారు.
6. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని
2014 జూన్ 2కు ముందు రాష్ట్రంలో 5,240 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆరు 400 కెవి సబ్ స్టేషన్లు మాత్రమే ఉండేవి. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి దాదాపు 13వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన 400 కెవి సబ్ స్టేషన్లు అవసరమని భావించిన విద్యుత్ శాఖ కొత్తగా 9 సబ్ స్టేషన్ల నిర్మాణానికి పూనుకున్నది. ఇప్పటికే సూర్యాపేట, నర్సాపూర్, అసుపాక, డిండి, మహేశ్వరంలో 3,980 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు 400 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసింది. జూలూరు పాడు, నిర్మల్, కేతిరెడ్డిపల్లి, జనగామల్లో 3705 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు 400 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతున్నది. మొత్తం పదిహేను 400 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం ద్వారా తెలంగాణలో భవిష్యత్ అవసరాలను కూడ దృష్టిలో పెట్టుకుని పంపిణీ వ్యవస్థను విద్యుత్ సంస్థలు సిద్ధం చేశాయి.
7. 220కేవీ,132 కేవీ సామర్థ్యం కలిగిన కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటు
400 కెవి సబ్ స్టేషన్లతో పాటు 19 కొత్త 220 కెవి సబ్ స్టేషన్లు నిర్మించింది. 35 కొత్త 132 కెవి సబ్ స్టేషన్లు కూడా నిర్మించింది. దీంతో తెలంగాణ రాకముందు 233 ఇ.హెచ్.టి. లైన్ల సామర్థ్యం కలిగిన సబ్ సస్టేషన్లు తెలంగాణలో ఉంటే, ఇప్పుడు 292 సబ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 33/11 కెవి సబ్ స్టేషన్లు కూడా వందల సంఖ్యలో నిర్మించారు. సబ్ స్టేషన్లతో పాటు 2,695.25 కిలోమీటర్ల మేర 400 కెవి లైన్లు, 6,900 కిలోమీటర్ల 220 కెవి లైన్లు, 10,321 కిలోమీటర్ల మేర 132 కెవి లైన్లు కొత్తగా వేశారు. తెలంగాణ రాకముందు 16,379 కిలోమీటర్ల లైన్లు ఉంటే, ఇప్పుడు 19,916 కిలోమీటర్ల లైన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా 33/11 కెవి లైన్లు కూడా దాదాపు 15వేల కిలోమీటర్లకు పైగా కొత్తగా వేశారు. తెలంగాణ వచ్చే నాటికి 3,748 పవర్ ట్రాన్స్ ఫార్మర్లుంటే, కొత్తగా 1,724 పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి, వాటి సంఖ్యను 5,472కు పెంచారు. లో ఓల్టేజి సమస్యను అధిగమించడానికి వేల సంఖ్యలో కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
8. సబ్ స్టేషన్ల వివరాలు
తెలంగాణ వచ్చే నాటికి: 2,397
కొత్త సబ్ స్టేషన్లు: 514
మొత్తం సబ్ స్టేషన్లు: 2,942
9. పవర్ ట్రాన్స్ ఫార్మర్లు:
తెలంగాణ వచ్చే నాటికి: 3,748
కొత్త పవర్ ట్రాన్స్ ఫార్మర్లు: 1,724
మొత్తం పవర్ ట్రాన్స్ ఫార్మర్లు: 5,472
10. విద్యుత్ లైన్లు:
తెలంగాణ వచ్చే నాటికి: 1,56,807 కి.మీ.
కొత్తగా వేసినవి: 19,154 కి.మీ.
మొత్తం లైన్లు: 1,75,961 కి.మీ.
11. 28వేల మెగావాట్ల కోసం ప్రణాళిక
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 6,574 మెగావాట్లు. చాలినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ప్రకటించారు. గ్రామాల్లో 6 నుంచి 8 గంటలు, పట్టణాల్లో 4 నుంచి 6గంటలు, హైదరాబాద్ నగరంలో 2 నుంచి 4 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. తెలంగాణలో కరెంటు కోతలు ఉండవద్దని నిర్ణయించిన ప్రభుత్వం అందుక తగ్గ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం ఏర్పడిన ఐదు నెలలకే నవంబర్ 20వ తేదీ 2014 నుంచి పరిశ్రమలకు, గృహాలకు, వాణిజ్య సంస్థలకు 24 గంటల విద్యుత్ అందుతున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు, మిషన్ భగీరథకు, కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన కరెంటు సరఫరా ఇవ్వడం కోసం పక్కా ప్రణాళికతో విద్యుత్ సంస్థలు ముందుకుపోతున్నాయి. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు చేసిన ఏర్పాట్ల ఫలితంగా అదనంగా 8,271 మెగావాట్లు విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రం సమకూర్చుకున్నది. దీంతో ప్రస్తుతం 14,845 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరో 13 వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవడం కోసం కొత్త ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నారు. దీంతో 2022 నాటికి తెలంగాణలో 28వేల మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కార్యాచరణ అమలవుతున్నది.
12. ఆటో స్టార్టర్లపై అవగాహణ:
రైతులకు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినా ఫలితం పూర్తిగా దక్కాలంటే ఆటో స్టార్టర్లు వందకు వందశాతం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. మొదట్లో పుష్కలంగా నీళ్లు పోసే బోర్లు పంట పొట్టకొచ్చే నాటికి భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఎండిపోయే పరిస్థితి వస్తుంది. కరెంటు అందుబాటులో ఉన్నా, భూగర్భంలో నీరు లేక రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఎక్కువ లోతున్న బోర్ల వల్ల తక్కువ లోతున్న బోర్లకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఆటో స్టార్టర్లు పూర్తిగా తొలగించుకోకపోతే, చివరికి 24 గంటల కరెంటు సరఫరా ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆటో స్టార్టర్లను తొలగించడానికి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది.
13. కరెంటు గోస తీరడం సంతోషకరం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే విద్యుత్ సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెరిగిందన్నారు.
‘‘దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడ ఈ కష్టాలు కొనసాగడం అర్థరహితమని భావించాం. అందుకే విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రాధాన్యం ఇచ్చాం. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడాన్ని గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. రైతులకు మేలు చేయడం కన్నా మించిన సంతృప్తి మరొకటి ఉండదు. రైతులతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు పనిచేశారు. దాని ఫలితంగానే ఇప్పుడు మనం అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుంటున్నాం. విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు తరలివస్తాయి. పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. విద్యుత్ తోనే అభివృద్ధి, మెరుగైన జీవితం ఆధారపడి ఉంది. అందుకే ప్రస్తుత అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ కరెంట్ కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా మారింది'' అని ముఖ్యమంత్రి అన్నారు.
14. ఉత్పత్తి, సరఫరాకు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ: ప్రభాకర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు వేశామని, దానికి అనుగుణంగా సరఫరా చేయనున్నామని సిఎండి ప్రభాకర్ రావు వివరించారు. డిమాండ్ కు తగ్గ సరఫరా చేయాలంటే పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని భావించి కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లు వేసినట్లు వివరించారు. ఇప్పుడు దాదాపు 9,500 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడుతున్నదని, రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందివ్వడంతో పాటు, ఎత్తిపోతల పథకానికి, మిషన్ భగీరథకు, పెరిగే పరిశ్రమలకు కరెంటు సరఫరా చేస్తే మరో 50 శాతం అదనంగా విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుందని అంచనా వేసినట్లు వివరించారు. ఉత్పత్తి కూడ గణనీయంగా పెరుగుతున్నందున పంపిణీ వ్యవస్థను విస్తరించినట్లు వెల్లడించారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నట్లు వివరించారు. రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేయడం గర్వకారణంగా భావిస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో జరగాలని, విద్యుత్ సంస్థల నిర్వహణ సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే జరగాలని ముఖ్యమంత్రి మొదటి నుంచీ గట్టిగా భావించారు. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు వస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. విద్యుత్ శాఖ పనితీరు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచడానికి ఉపయోగపడుతున్నందుకు మా సంస్థ ఉద్యోగులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు.
15. తెలంగాణలో విద్యుత్ సరఫరా మైలురాళ్లు
2014 నవంబర్ 20 నుంచి కరెంటు కోతల ఎత్తివేత. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా. పరిశ్రమలు, గృహాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా
2017 జూలై నుంచి పాత మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా
2017 నవంబర్ 6నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా
2018 జవవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా
2018 జవవరి 1 నుంచి అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం