ప్రమాద ఘంటికలు మోగిస్తున్న దేశ విత్త లోటు
మోడీ ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థలో ప్రమాధ ఘంటికలు మోగుతున్నాయి. నోట్ల రద్దు, జిఎస్టీఅమలుతో అనిశ్చితి, ఇతర ఆర్ధిక సంస్కరణలు దేశ విత్త లోటును అమాంతం పెంచాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్
మోడీ ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థలో ప్రమాధ ఘంటికలు మోగుతున్నాయి. నోట్ల రద్దు, జిఎస్టీఅమలుతో అనిశ్చితి, ఇతర ఆర్ధిక సంస్కరణలు దేశ విత్త లోటును అమాంతం పెంచాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో విత్త లోటు రూ.6.99 లక్షల కోట్లకు ఎగిసింది. ఇది బడ్జెట్ లక్ష్యంలో 112 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక నివేదికలో వెల్లడించింది. క్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే ఎనిమిది నెలల కాలంలో విత్త లోటు లక్ష్యంలో 85.8 శాతంగా ఉంది. 2016-17లో మొత్తంగా రూ.6.12 లక్షల కోట్ల విత్త లోటు నమోదయ్యింది. పన్నుల రాబడికి వ్యయానికి వ్యత్యాసమే విత్త లోటుగా పేర్కొంటారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో స్థూల జిడిపిలో 3.2 శాతం విత్త లోటును కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ లోటు పెరిగితే ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలకు కోత పెట్టనుంది. మరోవైపు అప్పుల కోసం విదేశాల ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. కొత్తగా రూ.50,000 కోట్ల అదనపు అప్పుకు వెళ్లనున్నట్లు గత బుధవారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఎనిమిది మాసాల్లో మొత్తం రెవెన్యూ వసూళ్లు, రుణ రహిత పెట్టుబడులు రూ.8.66 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్లో నిర్దేశించుకున్న రాబడిలో ఇది కేవలం 54.2 శాతమే. గత ఏప్రిల్-నవంబర్ కాలంలో రూ.14.78 లక్షల కోట్ల వ్యయం చోటు చేసుకుంది. 2016 నవంబర్ 8న ప్రధానీ మోడీ అనుహ్యాంగా పెద్ద నోట్లను రద్దు చేశారు. దీంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి ఒక్కసారిగా హరించుకుపోయింది. డిమాండ్ లేక పారిశ్రామికోత్పత్తి పడిపోయింది. అంతిమంగా పన్నుల రాబడిపై ప్రభావం పడింది. మరోవైపు 2017 జులై నుంచి కేంద్రం ప్రతిష్టాత్మకంగా వస్తు సేవల పన్ను (జిఎస్టి)ని అమల్లోకి తెచ్చింది. నూతన పన్ను చెల్లింపుల్లో అస్పష్టత, గందరగోళం నెలకొంది. దీంతో వ్యాపార వర్గాల నుంచి రావాల్సిన వస్తు పన్నులు కూడా తగ్గాయి. జిఎస్టి వల్ల పన్ను వసూళ్లు భారీగా పెరుగొచ్చన్న కేంద్ర ప్రభుత్వ అంచనాలు మారాయి. ఇందుకు నిదర్శనం వరుసగా రెండవ నెల నవంబర్లోనూ జిఎస్టి వసూళ్లు తగ్గి రూ.80,808 కోట్లకు పరిమితమయ్యాయి. జూలైలో నూతన పన్ను వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వసూళ్లలో ఇదే అత్యంత కనిష్టస్థాయి. అక్టోబర్లో జిఎస్టి వసూళ్లు రూ.83,000 కోట్లు, నవంబర్లో ఇవి రూ.80,808 కోట్లగా నమోదయ్యాయి. జూలైలో జిఎస్టి వసూళ్లు రూ. 95,000 కోట్లు. ఆగస్టులో రూ.91,000 కోట్లు. సెప్టెంబర్లో రూ.92,150 కోట్లుగా చోటు చేసుకున్నాయి.