మోడీ తదుపరి గురి: స్థిరాస్తులకు ఆధార్ లింక్ చేస్తారా!
మోడీ మరో గట్టి నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. అది స్థిరాస్తికి సంబంధించి ఉంటుందని సంకేతాలు అందుతున్నాయి. దాని గురించి విశేషాలు మీ కోసం...
నల్లధనం కట్టడి కోసం భాజపా ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తూనే ఉంది. అయితే నోట్ల రద్దుతో నల్లధనాన్ని బయటకు తీయాలన్న ప్రయత్నంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఇప్పటికీ ఆ నిర్ణయం పట్ల మోదీపైన కోపంగా ఉన్నట్లు అధికారంలో ఉన్న పెద్దలు భావించడం లేదు. దాంతో మోడీ మరో గట్టి నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. అది స్థిరాస్తికి సంబంధించి ఉంటుందని సంకేతాలు అందుతున్నాయి. దాని గురించి విశేషాలు మీ కోసం...
నోట్ల రద్దు-విమర్శ
నోట్ల రద్దుకు మోడీ ఉపక్రమించినప్పుడు మొదట చాలా మంది క్యూల్లో ఇబ్బందులు పడుతూనే ఏటీఎమ్ల్లో నోట్లు తీసుకున్నారు. దీర్ఘకాలంలో ప్రయోజనాలు వస్తాయని పంటి బిగువన కోపాన్ని,అసహనాన్ని దాచుకున్నారు. అప్పట్లో ఎక్కువ నల్లధనం స్థిరాస్తి లావాదేవీల్లో ఉంటుందని విమర్శించిన వారు లేకపోలేదు.
2. ప్రభుత్వ పోరాటం-నల్లధనంపై
ప్రభుత్వం మొదటి నుంచి నల్లధనానికి సంబంధించి దీర్ఘకాల పోరాటం జరుగుతుందని గట్టిగా చెబుతోంది. నోట్ల రద్దు అనేది నల్లధనంపై పోరాడేందుకు ఒక మార్గమేనని చెప్పింది. అలాంటి నిర్ణయాలు ఇకపై ఉంటాయని విమర్శకులకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
3. ఇప్పుడు కొత్త నిర్ణయంపై సూచనలు
దేశంలో స్థిరాస్తి రంగంలోనే అధికంగా నల్లధనం ప్రవాహం ఉంటుందని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వం సైతం సానుకూలంగా ముందుకెళుతోంది. నల్లధనంపై పోరుకు స్థిరాస్తిపై కేంద్రం దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఇందులో భాగంగానే స్థిరాస్తి లావాదేవీలకు ఆధార్ అనుసంధానించడాన్ని తప్పనిసరి చేస్తారని స్వయంగా కేంద్ర మంత్రే సూచనలు ఇవ్వడంతో ఇప్పుడు దానికి సంబంధించిన వాదన బలపడుతోంది.
4. ఈటీ నౌ( ET NOW) ఇంటర్వ్యూలో
ఆధార్ అనుసంధానం అవడం గురించి తనకు అనుమానం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఈటీ నౌ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా చెప్పారు. ఆధార్ సంఖ్యను స్థిరాస్తి లావాదేవీలకు అనుసంధానిస్తే అక్కడ ఉన్న నల్లధనం బయటకు వస్తుందని, అంతే కాకుండా బినామీ పేరిట ఆస్తుల కొనుగోలును నిరోధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
5. నల్లధనంపై పోరాటంలో భాగంగా
ప్రధానమంత్రి ఇప్పటికే చాలాసార్లు నల్లధనంపై తమ ప్రభుత్వ పోరాటం ఆగదని చెప్పారు. అంతే కాకుండా బినామీ ఆస్తులపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రసంగాల్లో చాలా సార్లు అన్నారు. ఆ దిశలో జరిగే పోరాటంలో ఆధార్ సంఖ్యను అనుసంధానించడం ఒకటి అనుకోవచ్చు.
కొత్త రెరా(స్థిరాస్తి నియంత్రణ) చట్టం ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు...
6. ఇదీ జరిగేది..
స్థిరాస్తుల కొనుగోలు,అమ్మకాల్లో బినామీ లావాదేవీలను అరికట్టేందుకు గాను రిజిస్ట్రేషన్లకు ఆధార్ను తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమల్లోకి వస్తే.. విక్రయ ఒప్పందపత్రం (సేల్ అగ్రిమెంట్), ప్రాతినిధ్య అధికార హక్కుపత్రం (పవర్ ఆఫ్ అటార్నీ) వంటి వాటికి ఆధార్ తప్పనిసరి అవుతుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పత్రాలు సమర్పించే ప్రతిఒక్కరికీ ఆధార్ గుర్తింపు అవసరమవుతుంది. కొనుగోలుదారులకు తమ ఆస్తుల పత్రాల్లో ఎలాంటి అవకతవకలు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుంది. అయితే దీని అమలు అధికార యంత్రాంగంపై ఆధారపడి ఉంటుంది.