రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2జీ సర్వీసుల నిలిపివేత
అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) సుమారు నెల రోజుల్లో తన 2జి మొబైల్ వ్యాపారాన్ని నిలిపివేయడానికి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే 3జీ , 4జీ సర్వీసులను మాత్రం అవి లాభాలు గడి
అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) సుమారు నెల రోజుల్లో తన 2జి మొబైల్ వ్యాపారాన్ని నిలిపివేయడానికి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే 3జీ , 4జీ సర్వీసులను మాత్రం అవి లాభాలు గడిస్తున్నంత కాలం కొనసాగించాలని ఆర్కామ్ నిర్ణయించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆర్కామ్ 2జీ సర్వీసులను సుమారు నెల రోజుల్లో మూసివేస్తున్నట్టు ఆ సంస్థ కార్యనిర్వాహక డైరెక్టర్ (ఇడి) గుర్దీప్ సింగ్ ఉద్యోగులకు తెలియజేసినట్లు సమాచారం. మన వైర్లెస్ బిజినెస్ను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందని, ఇప్పటి నుంచి నెల రోజుల్లోగా ఈ వ్యాపారాన్ని మూసివేయడానికి దారితీసిందని సింగ్ సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది.
అయితే లాభాలు గడిస్తున్నంత కాలం ఐఎల్డి వాయిస్, కన్జ్యూమర్ వాయిస్, 4జీ డోంగల్ పోస్ట్ పెయిడ్ సర్వీసులను, మొబైల్ టవర్ వ్యాపారాన్ని కంపెనీ కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇవి మినహా మిగతా వ్యాపారాలన్నింటిని కంపెనీ నిలిపివేస్తుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. రూ. 46వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్కామ్ తన వైర్లెస్ బిజినెస్ను ఎయిర్సెల్లో విలీనం చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని పూర్తి చేసుకోవడంలో విఫలమయిన నేపథ్యంలో 2జీ సేవలను నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎయిర్సెల్తో తన 2జీ సేవల విలీన ఒప్పందాన్ని ఆర్కామ్ ఈ నెల మొదట్లో పూర్తి చేసుకోవలసి ఉండింది. ఆర్కామ్, ఎయిర్సెల్లు నిరుడు సెప్టెంబర్లో తమ మొబైల్ వ్యాపారాలను విలీనం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఆ ఒప్పందం కాలం చెల్లిపోయిన కారణంగా రద్దయిందని ఆర్కామ్ ఆదివారం ప్రకటించింది.