విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు 7వ వేతన సంఘం బొనాంజా
ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎమ్, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీలు, ఎన్ఐటీల్లో పనిచేసే వివిధ అధ్యాపకులకు ప్రయోజనం కలగనుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు
కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు దీపావళి ముందే వచ్చింది. సుమారు 8 లక్షల మంది అధ్యాపకులకు 22 నుంచి 28 శాతం వేతనాలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 7వ వేతన సవరణ సంఘం సిపార్సులను ఆమోదించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎమ్, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీలు, ఎన్ఐటీల్లో పనిచేసే వివిధ అధ్యాపకులకు ప్రయోజనం కలగనుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
1. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బుధవారమే
7వ వేతన సవరణ సంఘం ఇచ్చిన సిఫార్సులపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పే కమిషన్ సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించినట్లు ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న యూనివర్సిటీ అధ్యాపకులకు, యూనియన్ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో ఉన్న వర్సిటీలు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సాంకేతిక, ఇతర ఉన్న విద్యాలయాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, టీచర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ఆయన చెప్పారు.
2. వేతనాల్లో 20 శాతం పెరుగుదల
7వ పే కమిషన్ అమల్లోకి రావడంతో నికర వేతనాలు సుమారు 20 శాతానికి పెరగనున్నాయి. ఇందులో సాధారణ పెరుగుతల 17 శాతం కాగా.. 2.57 శాతం ఫిట్మెంట్ అదనం. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపుదల కోసం సెప్టెంబర్ నెలలో మోదీ ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో మొత్తం 22 మంది సభ్యులున్నారు. సవరించిన వేతనాలు 2016 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయి.
3. పాత బకాయిల చెల్లింపు సైతం-త్వరగా
కేంద్రీయ విశ్వ విద్యాలయాల కోసం రూ.1400 కోట్లు, రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకు రూ.8400 కోట్ల మేర కేంద్రం చెల్లింపులు చేయాల్సి వస్తుందని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు సైతం 7వ వేతన సంఘం సిఫార్సులు అమలయ్యేలా చూస్తామని, పాత బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తామని వెల్లడించారు.
4. 7.58 లక్షల మందికి ప్రయోజనం
ఇప్పుడున్న వేతనాలకు అదనంగా రూ.10,400 నుంచి రూ.49,800 వరకూ అధ్యాపకులకు వేతనాల పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు. దీనివల్ల వేతనాల పెంపుదల రూ.పది వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందని తెలిపారు. వేతన సంఘం ప్రతిపాదలను అమలు చేయడం వలన కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.30,748 కోట్లు కేటాయించాల్సివుంటుంది. తాజా నిర్ణయం కారణంగా 7.58 లక్షల మంది అధ్యాపకులకు, వీరితో పాటు 329 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోనూ, 12,912 అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు ఏడో వేతన సంఘం ప్రకారం లబ్ది చేకూరుతుందని మంత్రి ప్రకటించారు.