ప్రతి నెలా రూ.5000 పెట్టుబడితో కోటీశ్వరులు అవడం ఎలా..?
15 శాతం వార్షిక రాబడినిచ్చే సాధనంలో నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెడితే 20 నుంచి 25 ఏళ్లలో రూ.1 కోటి సంపాదిస్తారు. క్రమ పద్దతిలో పెట్టుబడి పెడుతూ పోతే 21 సంవత్సరాల్లో కోటీశ్వరులు అయ్యేం
బాగా సంపాదించడంతోనే సరిపోదు. కొంత మంది ఐదంకెల జీతం వస్తున్నా నెలాఖరు వచ్చేసరికి మళ్లీ జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. అందుకే సంపాదిస్తేనే కాదు దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలిసిన వాడే అసలైన మదుపరి. నిరంతరం కష్టపడి సంపాదించిన దాని కంటే దాన్ని మంచి రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా జాగరూకత ఉండాలి. ఈ రోజుల్లో లక్షాధికారి నుంచి కోటీశ్వరులు కావాలని ఎవరికి ఉండదు. 15 శాతం వార్షిక రాబడినిచ్చే సాధనంలో నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెడితే 20 నుంచి 25 ఏళ్లలో రూ.1 కోటి సంపాదిస్తారు. క్రమ పద్దతిలో పెట్టుబడి పెడుతూ పోతే 21 సంవత్సరాల్లో కోటీశ్వరులు అయ్యేందుకు ఏ మార్గాలు ఉన్నాయో చూద్దాం.
ఏయే వాటిపై రాబడులు ఎలా?
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు రాబడి దాదాపు 7 శాతంగా ఉంది. పీపీఎఫ్; ఈపీఎప్ వంటి వాటిపై రాబడి 8-9 శాతం మధ్యలో ఉంది. బంగారంపై రాబడి కూడా బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే కొంచెం మెరుగ్గా ఉంది. స్థిరాస్తి సైతం ఈక్విటీ మార్కెట్లకు ధీటుగా రాబడులు ఇవ్వగల మరో పెట్టుబడి మార్గం. అయితే స్థిరాస్తి పెట్టుబడుల విషయానికి వచ్చే సరికి నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అనే తేడాతో పాటు భవిష్యత్తులో ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ది చెందుతుందన్న అనేక అంశాల ఆధారంగా వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. అయితే, ఏ విధంగా చూసినా స్థిరాస్తిపై రాబడులు.. బ్యాంకు డిపాజి్టలు, బంగారంపై కంటే ఎక్కువగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన వాస్తవం. కాకపోతే రియల్ ఎస్టేట్(స్థిరాస్తి మార్కెట్) ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఇంత శాతం వస్తుందని ముందే అంచనా వేయలేం. భవిష్యత్తలో ఈక్విటీ(స్టాక్) మార్కెట్లు 12 శాతం నుంచి 15 శాతం వరకూ రాబడులను ఇవ్వగలవని విశ్లేషకుల అంచనా.
నెలవారీ సిప్ - నిర్ణీత మొత్తం రూ.5000తో
దీర్ఘకాలంలో రూ. 1 కోటి కేవలం మీ సంపాదన నుంచి వచ్చిన పెట్టుబడితోనే ఆర్జించాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఒక మంచి మార్గం. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తోసిరాజని ఇవి మీకు ఎక్కువ మొత్తాన్ని సమకూరేలా చేస్తాయి.అంతే కాకుండా దీర్ఘకాలం పెట్టుబడి పెడతారు కనుక మూలధన రాబడి పన్ను సైతం ఉండదు. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5000 సిప్తో ప్రారంభించి ఏటా 10% చొప్పున సిప్ కేటాయింపులు పెంచుతున్నారనుకుందాం. అంటే మొదటి సంవత్సరం నెలా నెలా రూ.5000, రెండో సంవత్సరం రూ.5500, మూడో ఏట రూ.6050 అలా పెంచుకుంటూ పోతే రూ.21 ఏళ్లలో కోటీశ్వరుడు అవడం ఖాయం. ఇక్కడ సగటున 12% రాబడి వస్తుందని అనుకుని ఇలా లెక్కించడమైనది.
21 ఏళ్లలో ఒక కోటి వెనకేసుకోవాలంటే
లక్ష్యాన్ని చేరాలంటే మీకు దానికి తగిన రాబడి ఉండాలి. ఇంకా దాన్ని ముందుగానే చేరుకోవాలంటే మాత్రం రాబడి ఎక్కువ ఉండటం తప్ప మరో మార్గం లేదు. రాబడి తక్కువ వచ్చే సాధనాల్లో పెట్టుబడి పెడితే లక్ష్యం ఆలస్యమవుతుంది. ఉదాహరణకు 20 ఏళ్లలో కోటి రూపాయల నిధిని ఏర్పరుచుకోవాలని నిర్ణయించుకున్నారు అని అనుకుందాం. మరి దీన్ని చేరుకోవాలంటే నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి... ఏటా 5% రాబడినిచ్చే సాధనాలను ఎంచుకున్నట్లైతే నెలకు రూ. 24,328 పెట్టుబడి పెట్టాలి. బ్యాంకు డిపాజిట్లలో అయితే 7% రాబడి వస్తుందనుకుంటే నెలా నెలా రూ.19,196 కావాలి . 10 శాతం రాబడి ఇచ్చే వాటిలో అయితే ప్రతి నెలా రూ.13,168 ఇన్వెస్ట్ చేయాలి. అదే 15 శాతం రాబడి వచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే కేవలం నెలకు రూ.6679 చాలు. ఈక్విటీ ఫండ్లలో నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెడుతూ పోయినా రూ.1 కోటి లక్ష్యాన్ని 20 నుంచి 25 ఏళ్లలో చేరుకోగలుగుతారు. అంటే ఇక్కడ ఎంత శాతం రాబడి వస్తుందనేది ముఖ్యం.
మల్టీ బ్యాగర్ స్టాక్ ద్వారా
మ్యూచువల్ ఫండ్లలో సగటున గరిష్టంగా 25 శాతానికి మంచి రాబడులు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇలా కాకుండా కంపెనీల గురించి నిత్యం విశ్లేషిస్తూ, భవిష్యత్తును అంచనా వేయగలిగే సామర్థ్యం మీకుంటే నేరుగా మల్టీ బ్యాగర్ వంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా స్వల్ప కాలంలోనే కుబేరులు కావొచ్చు, ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్ షేరు ధర 2008 డిసెంబరు 31న 63 రూపాయలు. అది 2016 సెప్టెంబరు కల్లా సుమారు రూ.1100 వరకూ పెరిగింది. కానీ 63 రూపాయలు ఉన్నపుడు అది 10 రూపాయల ముఖ విలువ వద్ద ఉంది. దాన్ని గతేడాది 63 ముఖ విలువ ఉన్న సమయంలోనే 2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విడగొట్టడంతో పాటు ప్రతి షేరుకు మరో షేరును బోనస్గా ప్రకటించారు. అంటే వీటన్నింటినీ కలిపి చూస్తే ఒక షేరు ధర రూ.11 వేలు అయినట్లు లెక్క. దీని ప్రకారం 2008 డిసెంబరులో బజాజ్ ఫైనాన్స్ షేర్లను ఒక 100, రూ.6300 పెట్టి కొనుక్కుని ఉంటే ప్రస్తుతం 11 లక్షల రూపాయలు ఆర్జించే అవకాశం ఉండేది .అన్ని స్టాక్స్లో ఈ స్థాయి రాబడులు వస్తాయని కాదు. మంచి మల్టీ బ్యాగర్(ఎన్నో రెట్లు) అవుతుంటాయనే స్టాక్స్ గురించి విని ఉంటారు. వాటిని నిత్యం అధ్యయనం చేస్తూ ముందుకు సాగాలి.
ఐదేళ్లలో కోటి సాధ్యమా?
ఐదేళ్లలో కోటి అనగానే చాలా మంది దీన్ని అవకాశం లేని దానిగా కొట్టిపారేస్తారు. ఇది దమ్మున్న వాళ్లకు మాత్రమే. వారి మీద వారికి నమ్మకం ఉండటం, సృజనాత్మక,నిత్య నూతనత, సమస్యలకు పరిష్కారాలు వెతికే మేథ ఉండటం ఇక్కడ ప్రధానం. ఐదేళ్లో కోటి అంటే ఏడాదికి రూ.20 లక్షలు. ఇది సాధ్యమయ్యే పనేనా... మొదట మన మెదడుకు తట్టేది ఇదే. నిజానికి ఇటువంటి లక్ష్యాలు చేరాలంటే అందుకు వ్యాపారాలే సరైన మార్గం అని ఎక్కువ మంది ఒప్పుకుంటారు. మీ దగ్గర నైపుణ్యం ఉండి ఎక్కువ మంది సమస్యలకు పరిష్కారం చూపగల నేర్పుంటే స్టార్టప్ను ప్రారంభించండి. అది ఉత్పత్తి కావచ్చు, సేవ కావచ్చు, అవసరమైతే యాప్ తయారు చేయించండి. దాన్ని పాపులర్ అయ్యేలా చేసి ఐదేళ్ల తర్వాత మరో కంపెనీకి విక్రయించడం ద్వారా కోటి రూపాయలు మాత్రమే కాదు, అంతకు 10 రెట్లు అధికంగా సైతం సంపాదించే ఆస్కారం ఉంది. లేకుంటే నిత్యం ప్రజలకు అవసరం అనిపించే ఉత్పత్తిని తయారుచేయండి. ఒక్కొక్కటి వెయ్యి రూపాయల చొప్పున 10 వేల మందికి విక్రయించేయండి. ఐదేళ్లు ఎందుకు ఏడాదిలోనే రూ.1 కోటి సంపాదించుకోవచ్చు. కాకపోతే ఇటువంటివి ప్రారంభించేముందు ఎటువంటి సమస్యలు వస్తాయో లోతుగా అవగాహన కల్పించుకోవడం ముఖ్యం.
సంపద వృద్దికి 10 ఉత్తమ పెట్టుబడులు