2 నెలల్లో 19 లక్షల కొత్త మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ -మే నెలల్లో మ్యూచువల్ ఫండ్ హౌస్లు కొత్తగా 19లక్షల మంది పెట్టుబడిదారుల ఖాతాలను తెరిచాయి. రిటైల్, అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారుల(హెచ్ఎన్ఐల) నుంచి ఆసక్తి
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ -మే నెలల్లో మ్యూచువల్ ఫండ్ హౌస్లు కొత్తగా 19లక్షల మంది పెట్టుబడిదారుల ఖాతాలను తెరిచాయి. రిటైల్, అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారుల(హెచ్ఎన్ఐల) నుంచి ఆసక్తి పెరగడంతో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య రికార్డు స్థాయిలో 5.72 కోట్లకు చేరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జత చేరిన 77 లక్షల ఫోలియాలు, అంతకుముందు(2015-16) ఆర్థిక సంవత్సరంలో కొత్తగా చేరిన మొత్తం 59 లక్షల ఖాతాలతో పోలిస్తే రెండు నెలల్లో మొదలైన ఫోలియోలు(మ్యూచువల్ ఫండ్ ఖాతాలు) చాలా అధికం. ఈ విధంగా చూస్తే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా అనుకూలమో తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్ ఫోలియో
ఫోలియో అంటే ఒక్కో వ్యక్తిగత పెట్టుబడిదారుకు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కేటాయించే ఖాతా సంఖ్య. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) ఇచ్చిన సమాచారం ప్రకారం 42 ఫండ్ హౌస్లు వద్ద ఉన్న మొత్తం ఫోలియోలు మార్చి చివరి నాటికి 5.53 కోట్లుగా ఉండగా; ప్రస్తుతం రెండు నెలల్లో 17.90 లక్షలు పెరిగి మే చివరి నాటికి 5.71 కోట్లకు పెరిగాయి.
ఫండ్లపై ఆసక్తికి కారణం
ఈ పరిణామం గురించి ఫండ్స్ ఇండియా ప్రతినిధి విద్యా బాలా మాట్లాడుతూ రిటైల్, హెచ్ఎన్ఐలు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గుచూపుతుండటం దీనికి కారణమని చెప్పారు. రిటైల్ పెట్టుబడి దారుల ఖాతాల సంఖ్య ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు, బ్యాలెన్స్డ్ మూడు కలిపి మార్చిలో 4.4 కోట్లుండగా, మే చివరి నాటికి 4.6 కోట్లుగా ఉన్నాయి.
దీర్ఘకాల రాబడి కోసం ఈక్విటీ ఆధారిత ఫండ్లలో
చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్వెస్టర్లు 24 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈక్విటీ ఆధారిత పథకాల్లో తమ డబ్బును మదుపు చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వాటికి దీర్ఘకాలిక మూలధన రాబడికి అర్హత వస్తుందని బజాజ్ క్యాపిటల్ సీఈవో రాహుల్ పరిఖ్ విశ్లేషించారు. ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టేవారు కానీ లేదా సిప్ మార్గంలో పెట్టుబడి పెట్టేవారు కానీ ఈక్విటీల్లో దీర్ఘకాలం డబ్బు ఉంచేందుకు మొగ్గుచూపుతున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ.19 లక్షల కోట్లుగా ఉండగా ఏడాది చివరకు అది రూ.20 లక్షల కోట్లను చేరుకోగలదని భావిస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్
మదుపర్లకు వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనువైన పద్దతులు లేదా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. మదుపరులకు మ్యూచువల్ పండ్ సంస్థలు పెట్టుబడులు పెట్టుకునేందుకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేముందు ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఏజెంట్ల, పంపిణీదారుల సలహాలు కూడా తీసుకుంటే మంచిది. ఉద్యోగులకు నెలవారీ కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సిప్ మార్గం అనువైనది.