కేంద్ర బడ్జెట్లో ఈ రోజు గమనించాల్సిన ప్రధాన అంశాలేమిటి?
యూనియన్ బడ్జెట్లో ఈ రోజు గమనించాల్సిన ప్రధాన అంశాలేమిటి?
ఈ రోజు అరుణ్ జైట్లీ పార్లమెంటుకు తన 4వ బడ్జెట్ను సమర్పిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కావడంతో ప్రజలకు ఎన్నో ఆశలు, ఆర్థికవేత్తల నుంచి ఎంతో ఆసక్తి నెలకొంది. దేశ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంటుందని ఆర్థిక సర్వే 2016-17 అంచనా వేసింది. నోట్ల రద్దు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రగతిలక్ష్యాలను అందుకోలేకపోయినా, వచ్చే ఏడాది మాత్రం ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. ఒక పక్క జీస్టీ, మరో పక్క నల్లధనంపై కట్టుదిట్టమైన చర్యలు, పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు అయిన గాయాలను మందు పూసే చర్యలు ఎలా ఉంటాయో అని దేశమంతా వేచిచూస్తోంది. ఈ నేపథ్యంలో 2017-18 కేంద్ర బడ్జెట్లో గమనించాల్సిన కీలకాంశాలను ఇక్కడ చూద్దాం.
ఉద్యోగాల కల్పన
ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు పెద్ద పీట వేస్తుంది. ఇప్పటికే స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తయారీ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా ఆయా పరిశ్రమలకు ఊతమివ్వచ్చు. అంతే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు గతేడాది బడ్జెట్లానే ఇప్పుడు కేటాయింపులు ఇతోధికంగా ఇవ్వడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టవచ్చు. దశాబ్ద కాలంగా ఉద్యోగాలు లేని యువత పెరుగుతూ వస్తోంది. ఏటా 1.20 కోట్ల మంది కార్మిక శక్తిలో కలుస్తుండగా వారందరికీ ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వానికి సవాలే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కల్పనకు, తద్వారా ఆర్థిక వృద్దికి జైట్లీ ఏమి చేస్తారో చూడాలి.
వైద్యం మాటేమిటి?
ఏటా బడ్జెట్లో వైద్య రంగానికి దేశ జీడీపీలో 1.2 శాతమే కేటాయిస్తున్నారు. దీన్ని ఐదు శాతానికి పెంచాలి. ఈ మొత్తంలో 55 శాతాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 35 శాతాన్ని ఏరియా ఆస్పత్రులకు, 10 శాతాన్ని సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. నిధులు విడుదల చేయకపోవడం వల్ల గడిచిన రెండేళ్లలో జాతీయ అంధత్వం నివారణ వంటి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ఇక లైఫ్ సేవింగ్ డ్రగ్స్తో పాటు వైద్య పరికరాలపై విపరీతమైన టాక్స్ విధించడం వల్ల వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీనితో పాటు జాతీయ ఆరోగ్య పాలసీని ప్రకటించాలి. దేశవ్యాప్తంగా అందరికీ ఉమ్మడిగా వర్తించే ఆరోగ్య బీమా పాలసీలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు చేపడుతుందేమో చూడాలి.
పన్ను రేట్లు
ధైర్యంగా పన్ను రేట్లు తగ్గించాలని ఆర్థిక సర్వే సూచించడం విశేషం. ఆదాయ పన్ను రేట్లను తగ్గించాలని, కార్పొరేట్ పన్ను తగ్గింపునకు కాలపరిమితిని విధించుకోవాలని సిఫార్సు చేసింది. అదే సమయంలో అధిక ఆదాయం ఉన్నవారిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని తెలిపింది. ‘అధిక ఆదాయ వర్గాలు' అంటే ఏమిటో వివరించలేదు. అయితే వ్యవసాయ ఆదాయానికి ప్రస్తుతం మినహాయింపు ఉన్నందున దానినే పన్ను పరిధిలోకి తేవాలన్న అర్థం వస్తోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంతే కాకుండా కనీస సార్వత్రిక ఆదాయం(యూబీఐ) ప్రస్తావన గమనార్హం. వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి పన్ను శ్లాబులను గణనీయంగా పెంచుతారని మధ్య తరగతి కోటి ఆశలు పెట్టుకున్నారు. వీటిని జైట్లీ తీరుస్తారో లేదో!
బడ్జెట్లో వాడే కీలక పదాల అర్థాలేంటి?
వినియోగాన్ని పెంచే చర్యలు ఉంటాయా?
వచ్చే ఏడాది కాలంలో 15% చమురు(పెట్రోలు) ధరలు పెరగనున్నాయన్న అంచనాలు, ప్రజల నుంచి పెరుగుతున్న పెట్టుబడులు, వరల్డ్ ట్రేడ్లో ముసురుతున్న వివాదాలు, దేశాలు తమంతకు తాముగా రక్షణ విధానాలు అవలంబిస్తున్న ప్రస్తుత తరుణంలో వృద్దిపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ప్రత్యక్ష పన్ను రేట్లు, శ్లాబులో మార్పులు చేయక తప్పనిసరి పరిస్థితి. వచ్చే ఏడాది కాలంలో వృద్ది రేటు 6.5%-7.5% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో వినిమయ శక్తి తగ్గింది. దీంతో ఎకానమీని పరుగులు పెట్టించేందుకు ఒక పక్క విత్త లోటును పరిమితుల్లోనే ఉంచుతూ కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించాల్సి ఉంది. 2015-16లో జీడీపీలో విత్త లోటు 3.9% లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ప్రస్తుతం దాన్ని 3.5% గా నిర్ణయించుకోవడం విశేషం.
ఆధార్ కార్డులో తప్పులను సవరించుకునేదెలా?
విద్యను ప్రోత్సహించేందుకు ఏం చేస్తారు?
అందరికీ చదువుకునేందుకు అవకాశం, విద్యా ప్రవేశ అర్హతలు, నాణ్యమైన బోధన వసతులు- ఏ విద్యావ్యవస్థకైనా ఉత్తమ ప్రమాణాలు. కానీ, ఈ మూడు అంశాల్లో భారత్ వెనకబడిపోయింది. ఒకటో తరగతి పిల్లల్లో 53.9 శాతం అక్షరాలను గుర్తించలేకపోతున్నారని ‘ప్రథమ్-2016' నివేదిక తెలపడం దీనికి నిదర్శనం. జీడీపీలో విద్యా రంగానికి 6% కేటాయించాలని 1966లోనే డీఎస్ కొఠారీ కమిషన్ సిఫార్సు చేసింది. నేటికీ అది 0.5 శాతానికి మించడం లేదు. పాకిస్థాన్ విద్యారంగం కేటాయింపులు జీడీపీలో 2.5 శాతం మేర ఉంటున్నాయి. నేడు దేశ జనాభాలో డిజిటల్ అక్షరాస్యులు 15 శాతమే. రానున్న మూడేళ్లలో వీరిని 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం తలపెట్టింది. అది సాధ్యపడాలంటే దేశంలో డిజిటల్ మౌలిక వసతులను విస్తరించాలి. ప్రభుత్వ పాఠశాలల మీద సామాన్యులకు ఆశలు నీరుగారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తూ, డిజిటల్ తరగతి గదుల దిశగా దేశ విద్యా వ్యవస్థను మార్చేందుకు వీలుగా కేటాయింపులు ఉంటాయోమోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ యాప్లతో ఎస్బీఐ బ్యాంకింగ్ను సులభతరం చేసింది
పన్ను శ్లాబులు
ఆదాయ పన్ను శ్లాబులు చాలా తక్కువగా ఉన్నాయని మధ్య తరగతి వాదిస్తున్నారు. రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కనీసం దీన్ని రూ. 4 లక్షలకు పెంచాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు.
బడ్జెట్ నుంచి వివిధ రంగాల వారు ఆశించేదేమిటి?
కనీసం సార్వత్రిక ఆదాయం (యూబీఐ)
మనందరికీ ఏ పని చేసినా చేయకున్నా.. నెల నెలా కనీస మొత్తం వేతనంగా లభించ గలదా? చిన్నా పెద్దా తేడా లేకుండా, పేద ధనిక తేడా లేకుండా, ఆడా మగా తేడా లేకుండా, ఉద్యోగీ నిరుద్యోగీ తేడా లేకుండా ఆ మొత్తం ప్రతి నెలా లభిస్తుంటే ఏం జరుగుతుంది? జీవించే హక్కులాగానే.. జీవితాంతం నెల వారీ కనీస వేతనం పొందే హక్కు ఉంటే జీవనం ఎలా ఉంటుంది? ఇలాంటి హక్కు సాధ్యమవుతుందా? అంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. కానీ దీన్ని నిజం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రతి కంటి నుంచి వచ్చే కన్నీటి చుక్కను తుడిచేసే ఉద్దేశంతో కనీస సార్వత్రిక ఆదాయం అమలు పరచాలని ఆర్థిక సర్వే నొక్కి వక్కాణించింది. స్వాతంత్రం వచ్చినప్పుడు పేదరిక స్థాయి 70% ఉంటే ప్రస్తుతం అది 22%కి తగ్గింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పేదరికం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పేదరికాన్ని యుద్ద ప్రాతిపదికన యూబీఐ పరిష్కారం చూపగలదేమో పరిశీలించాలి. ఇది కూడా చదవండి డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి బంపర్ ఆఫర్లను ప్రకటించిన ప్రభుత్వం